అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళి పై దాడిని నిరసిస్తూ శుక్రవారం డీజీపీకి లేఖ రాస్తు టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. దాడులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రత తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల ప్రాథమిక హక్కులను సైతం వైసీపీ నాయకులు హరించివేస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ సానుభూతిపరులపై పదేపదే దాడులు, బెదిరింపులు జరుగుతున్నప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైన శాంతి భద్రతల విషయంలో పక్షపాత ధోరణి వదిలి బాధితులకు అండగా నిలవాలని, కుప్పం సంఘటనలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.