Chandrababu | రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు విద్యావ్యవస్థ మనుగడకే గొడ్డలి పెట్టని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో బాధితుల పక్షాన టీడీపీ పోరాడుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం స్పష్టం చేశారు. సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయంతో బడులకు వెళ్లాల్సిన విద్యార్థులు వీధిన పడ్డారన్నారు. ఎయిడెడ్ విద్యావిధానాన్ని నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో పాలకులు ఆడుకోవడం సరి కాదన్నారు. తక్షణం ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సర్కార్ తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలన్నారు.
విద్యార్థుల భవితవ్యాన్ని నాశనం చేసే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే కోవిడ్ వల్ల విద్యాసంవత్సరం రెండు నెలలు ఆలస్యంగా మొదలైందన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
విద్యాసంవత్సరం మధ్యలో సర్కార్ తీసుకున్న నిర్ణయం విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 150 ఏండ్లుగా సాగుతున్న ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ఎందుకు నీరు గారుస్తున్నారని నిలదీశారు.