Chandrababu | తాము ఎన్డీఏ (NDA) కూటమితోనే ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పష్టత ఇచ్చారు. ఇండియా కూటమితో చేతులు కలిపే అవకాశం ఉందని, ఇప్పటికే కూటమి నేతలు బాబును సంప్రదించారన్న వార్తలపై ఆయన స్పందించారు. ‘మేం ఎన్డీయేలో ఉన్నాం. భేటీకి హాజరవుతున్నాం. ఇందులో వేరే ఆలోచనకు తావులేదు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘనవిజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మీడియా సహా రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే నినాదంతోనే పని చేశామన్నారు. ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లామని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు.
‘నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. కూటమికి 55.38 శాతం ఓట్లు రాగా.. 45.60 శాతం టీడీపీకి వచ్చాయి. వైఎస్సార్సీపీకి 39.37 శాతం ఓట్లు పోలయ్యాయి. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది. ఐదేళ్లు మా కార్యకర్తలు చాలామంది ఇబ్బందిపడ్డారు. కార్యకర్తలకు కంటినిండా నిద్ర కూడా పోని పరిస్థితి. ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలిని. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి మళ్లీ ఇప్పుడే ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి’ అని చంద్రబాబు తెలిపారు.
Also Read..
Supriya Sule | బారామతి స్థానం సుప్రియా సూలేదే.. ఉత్కంఠ పోరులో వదినపై ఘన విజయం
MLC counting | కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..
Union Ministers: 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన కేంద్ర మంత్రులు వీళ్లే..