PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రాష్ట్ర పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 16న ఆయన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గతంలో అమరావతి, విశాఖపట్నం నగరాల్లో జరిగిన ప్రధానమంత్రి కార్యక్రమాలను మించిపోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా తొలుత ఆయన శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు.
తర్వాత, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు, అప్పుడు అక్కడ ఆయన ప్రసంగిస్తారు. ఈ సభను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ-2.0 సంస్కరణలకు మద్దతుగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సంస్కరణలను స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీలో తొలిసారిగా అభినందన తీర్మానం చేసి, జీఎస్టీని అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. దసరా నుంచి దీపావళి వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా, ప్రధాని ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కార్యక్రమం ఏర్పాట్లు మరింత పటిష్టంగా ఉండాలని సూచించారు. సభలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఆహారం వంటి ప్రాథమిక సౌకర్యాలు అందించాలని స్పష్టం చేశారు. అలాగే, సభా ప్రాంగణానికి వెళ్లే రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు, వాహనాల పార్కింగ్ మరియు ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, బీసీ జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.