అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడానికి ఈనెల 26 నుంచి 29వ తేదీవరకు మంత్రుల బస్సుయాత్రను నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుందని వెల్లడించారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్దని కొనియాడారు. ఈ వర్గాలకు అందనంత దూరంలో ఉన్న అధికారాలను సీఎం జగన్ పాలనలో జరిగిందని అన్నారు . ఈ విషయాలు రాష్ట్రమంతా చెప్పాలనే బస్సు యాత్ర చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి వర్గాలను గౌరవించకుండా మోసగించిన వాళ్లు ప్రజల మధ్యకు వెళ్లి తాము ఏమీ చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
రోజుకో పెద్ద బహిరంగ సభ ఆయా జిల్లాలో ఉంటుందని తెలిపారు. కేబినెట్లో 77 శాతం సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారని వివరించారు. రాజ్యసభ సీటును ఒక తెలంగాణ బీసీ వ్యక్తికి ఇస్తే తప్పు పడుతున్నారని తెలిపారు . ఎక్కడున్నాడు అని ముఖ్యం కాదని ఆయా వర్గాల ఘోష వినిపించే వ్యక్తి కావాలని అన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళలు కన్న సమాజాన్ని సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారని తెలిపారు.