Ravela Kishore Babu | దళితుల పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని ఏపీ భారత్ రాష్ట్ర సమితి నేత రావెల కిశోర్ బాబు అన్నారు. రూ.150కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దళితులపట్ల గౌరవాన్ని కేసీఆర్ పెంచారన్నారు. అంబేద్కర్ మనుమడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారని, రూ.650కోట్లతో నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసునన్నారు.
అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను దోచుకుంటోందని, అదానీలాంటి వాళ్లకు పల్లకీ మోస్తూ అంబేద్కర్ అశయాలను అణగదొక్కుతున్నారని విమర్శించారు. కులమతాలకతీతంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు తరలిరావాలని కోరారు. ‘ఛలో హైదరాబాద్’ పేరుతో హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ హోదా ఏమీ రద్దు కాలేదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఏపీలో పోటీ చేస్తామని పేర్కొన్నారు.