శ్రీశైలం : మకర సంక్రాంతి సందర్భంగా శ్రీశైలం (Srisailam) ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజులో భాగంగా సోమవారం స్వామివార్లకు విశేష పూజలను నిర్వహించారు. యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు, లోకకల్యాణం కోసం చతుర్వేద పారాయణం, జపాలు, రుద్రపారాయణం నిర్వహించారు. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు.
సాయంత్రం నందివాహన (Nandi Vahana Seva) సేవను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంలో వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం పురవీధులలో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం మధ్య ఊరేగించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి (Chairman Chakarapani Reddy) , కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు (EO Peddiraju) తదితరులు పాల్గొన్నారు.