విజయవాడ నగరానికి మహర్దశ వచ్చింది. ఇప్పటికే దుర్గమ్మ వారధిని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. మరో ముఖ్యమైన బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ను కూడా ప్రారంభించింది. ఈ ఫ్లైఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్తోపాటు మరో కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి కూడా పాల్గొన్నారు. విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. కేంద్ర మంత్రి గడ్కరీ సహకారంతో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ శరవేగంగా పూర్తయిందని, పెండింగ్ ప్రాజెక్టులు, భూసేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ రోడ్డు పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విశాఖ సముద్రతీరాన్ని తాకుతూ భోగాపురం ఎయిర్పోర్టును కనెక్ట్ చేసేలా ఎన్హెచ్ 16 ను కలుపుతూ ఆరు లైన్ల రహదారి అవసరమని జగన్ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రాన్ని ఆదుకున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కాగా, జగన్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ విజయవాడకు మరో బైపాస్కు మంజూరుచేశారు.
అంతకుముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డిలకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు. బీజేపీ తరపున ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్ స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని గడ్కరీ, కిషన్రెడ్డి సందర్శించారు.