అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తిరిగి హైదరాబాద్ పయనమవ్వగా, మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో షాద్ నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ స్టేషన్ అనుకుని దిగిపోయింది.
తర్వాత అది కాచిగూడ స్టేషన్ కాదని తెలుసుకుని మళ్లీ రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి ప్లాట్ఫామ్పై పడిపోయింది. ఈ ప్రమాదంలో జ్యోతిరెడ్డి తలకు బలమైన గాయమైంది. వెంటనే రైల్వే సిబ్బంది ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.