Nandigam Suresh | ఓ మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ (Nandigam Suresh)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 145 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
కాగా, 2020 డిసెంబర్ 27న వెలగపూడిలో (Velagapudi) రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. వైసీపీ (YCP) అధికారంలో ఉండటంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ ప్రారంభమైంది. ఈ హత్య కేసులో సురేశ్ను గతేడాది అక్టోబర్ 7న పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు తీవ్రత దృష్ట్యా సురేష్కు ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నందిగం సురేశ్ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలో పిటిషన్ విచారణకు రాగా ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కేసులో చార్జిషీటు కూడా దాఖలైందున బెయిల్ కోసం మరోసారి ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఆయన గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. రూ.10 వేల పూచీకత్తుతో సురేశ్కు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో దాదాపు 145 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన సురేశ్ పలు ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స కోసం అంబులెన్స్లో విజయవాడకు బయల్దేరి వెళ్లారు.
Also Read..
“Nandigam Suresh | నందిగం సురేశ్కు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు”
“Nandigam Suresh | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ముందస్తు బెయిల్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు”
“Nandigam Suresh | మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మరో షాక్.. హత్యాయత్నం కేసు నమోదు”