అమరావతి : అప్పుల వేధింపులకు మరో కుటుంబం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. మచిలిపట్నంకు చెందిన వెంకటేశ్వరరావు గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఎవరికీ చెప్పకుండా భార్య, పిల్లలతో కలసి విజయవాడకు వచ్చి గత 17 రోజులుగా లాడ్జిలో ఉంటున్నాడు.
అప్పులు తీర్చే మార్గం దొరకకపోవడంతో భార్య రాధారాణి, ఇద్దకు కూతుర్లు భావన, శ్రావణితో కలిసి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. లాడ్జి నుంచి అరుపులు రావడంతో సిబ్బంది గమనించి ఆ కుటుంబాన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.