Woman Molest | హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరువన్నమలై(అరుణాచలం)లో ఏపీకి చెందిన ఓ 18 ఏండ్ల యువతిపై తమిళ పోలీసులు కామంతో చెలరేగిపోయారు. తన సోదరి ముందే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అత్యాచారం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎంథాల్ బైపాస్ వద్ద నిన్న రాత్రి టమాటా లోడ్తో వెళ్తున్న ఓ గూడ్స్ వాహనాన్ని ఇద్దరు కానిస్టేబుల్స్ ఆపి తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా ఆ వాహనంలో ఉన్న యువతిపై పోలీసులు కన్నేశారు. అనుమానం ఉందంటూ దబాయిస్తూ.. ఆ యువతిని కొట్టి కిందకు దింపారు.
తన సోదరి ముందే.. ఆమెను పక్కనే ఉన్న పంట పొలాల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు ఇద్దరు కానిస్టేబుల్స్ సుందర్, సురేశ్ రాజ్. అనంతరంపై ఆమెపై విరుచుకుపడ్డారు. బాధితురాలి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్థానికులు అక్కడికి వచ్చేలోపు పోలీసులు పరారీ అయ్యారు. బాధిత యువతిని అంబులెన్స్లో తిరువన్నమలై ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు.. బాధితురాలిని ఆస్పత్రిలో విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే తన సోదరితో కలిసి అరుణాచలం దైవదర్శనానికి వచ్చినట్లు ఆమె పేర్కొంది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.