అమరావతి : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రపంచానికి అన్ని సేవలు ఇవ్వగలిగే స్థాయికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేండ్లుగా రాష్ట్రంలో విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని వెల్లడించారు. గూగుల్కంపెనీ (Google) రాక రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్గా మారబోతుందని వివరించారు.
నాలుగురోజుల పాటు దావోస్లో (Davos) జరిగిన పెట్టుబడుల సదస్సులో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా శనివారం ఆ వివరాలను, పెట్టుబడుదారులతో చేసుకున్న ఒప్పందాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. దావోస్ అనేది కార్పొరేట్ కంపెనీలు, వివిధ దేశాల ప్రతినిధులు వచ్చే కేంద్రమని, అందరినీ ఒకేచోట కలుసుకుని, ప్రపంచంలో వచ్చే ఆధునిక ఆలోచనలు , ట్రెండ్స్ తెలుసుకునే అవకాశముంటుందని పేర్కొన్నారు. 1997నుంచి ప్రతిసారి తాను దావోస్కు వెళ్తున్నానని తెలిపారు.
ఈసారి దావోస్లో జరిగిన సమావేశంలో ఏపీలో గ్రీన్ ఎనర్జీ (Green Energy) , గ్రీన్ హైడ్రోజన్(Green Hydrogen) , ఏఐ(AI) అనే కీలక అంశాలను వివరించానని అన్నారు. అనేక మల్టినేషనల్ కంపెనీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయని వివరించారు. కేంద్రం కూడా రాష్ట్రం అభివృద్ధికి సహకారం అందిస్తుందని అన్నారు.
రామాయంపట్నంలో రూ. 95 వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఎల్జీ కంపెనీ రూ. 5వేల కోట్లతో పెట్టుబడులు, రూ. 65 వేల కోట్లతో రిలయెన్స్ బయో ఫ్లూయల్ ప్లాంట్ ఏర్పాటు, విశాఖలో ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ. 13 వేల కోట్లను ఆర్థిక ప్యాకేజీ కింద ఇవ్వడం అసాధారణమైన విషయమని అన్నారు. అనకాపల్లి వద్ద రూ. 1.35 లక్షల కోట్లతో స్టీల్ప్లాంట్ వస్తోందని అన్నారు. మొత్తంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దబోతున్నామని చంద్రబాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పనులు వేగవంతం చేశామని , 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. దావోస్ వెళ్లి ఎన్ని ఒప్పందాలు చేశారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.