YS Sharmila | రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ? అని నిలదీశారు. గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారని.. జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
వైద్య విద్య ప్రైవేటీకరణపై సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిఆమండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షంగా ఉండి, ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైన పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమని, నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని మెడికల్ బోర్డుకు లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా ? అని అన్నారు. ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు అని విమర్శించారు.
కొత్తగా 750 సీట్లు సమకూరకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే అని షర్మిల అన్నారు. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆశలను నీరు గార్చారని అన్నారు. మెడికల్ సీట్ల కోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారని పేర్కొన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం పెట్టి YCP సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే… ఆ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చిన కూటమి సర్కార్..ఇప్పుడు అదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. కొత్త మెడికల్ కాలేజీల్లో వసతులను కల్పించి,ఈ ఏడాది నుంచే వాటిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.