AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. వీరి రిలీజ్ సందర్భంగా విజయవాడ సబ్ జైలు వద్ద దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా కొనసాగింది. అధికారులు జాప్యం చేయడంతో జైలు బయట న్యాయవాదులు, లోపల నిందితులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్తతల నేపథ్యంలో నిందితులను జైలు అధికారులు బయటకొచ్చారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సీఎంవో మాజీ కార్యదర్శి కె. ధనంజయ రెడ్డి ఏ 31గా, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఏ32గా, బాలాజీ గోవిందప్ప ఏ33గా ఉన్నారు. వీరికి విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో వారు నిన్న సాయంత్రమే జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. బెయిల్ ఆర్డర్లు తీసుకుని వారి తరఫు న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. రాత్రి 8.30 గంటల వరకు జైలు వద్దే ఉన్నప్పటికీ.. సమయం అయిపోయాక వచ్చారనే సాకుతో నిన్న జైలు నుంచి విడుదల చేయలేదు. దీంతో ఇవాళ ఉదయమే బెయిల్ ఆర్డర్లతో న్యాయవాదులు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. కానీ జైలు సూపరింటెండెంట్ మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నారని.. కాసేపు ఆగాలని చెబుతూ దాదాపు 3 గంటల పాటు వెయిట్ చేయించారు.
జైలు అధికారుల తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని సబ్ జైలు బయట ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సబ్ జైలులో నిందితులు కూడా ఆందోళన చేపట్టారు. బెయిల్ ఇచ్చినా విడుదల చేయకపోవడంతో జైలు లోపల గేటు దగ్గర నినాదాలు చేశారు. బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనుంజయ్ రెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. మళ్లీ ఏదో కేసు పెట్టి జైలులో బంధించాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.