Chandrababu | ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారిపోయారు. ఐటీ నోటీసుల గురించి తెలుసుకున్న మనోజ్ వాసుదేవ్ ఈ నెల 5న దుబాయ్ పారిపోగా.. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు అమెరికా వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. కాగా షెల్ కంపెనీ సృష్టికర్త అయిన యోగేశ్ గుప్తా మాత్రం ఐటీ విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు.
టీడీపీ హాయంలో 2016 నుంచి 2019 మధ్యకాలంలో బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల ప్రజాధనం ముడుపుల రూపంలో చేతులు మారినట్లు ఇటీవల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ సబ్ కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి ఈ డబ్బులను తమ ఖాతాల్లోకి మల్లించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో స్పందించిన ఐటీ అధికారులు.. చంద్రబాబుతో పాటు శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్, యోగేశ్ గుప్తాకు నోటీసులు అందజేశారు. గత వారం వాళ్ల నివాసాల్లో తనిఖీలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ ద్వారా ముడుపులు చేతులు మారినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. 2016 నుంచి 2019 మధ్య ఎన్ని కాంట్రాక్టులు పొందారు? అందుకు డబ్బులను ఎలా సమకూర్చారు? డబ్బులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మనోజ్, పీఏ శ్రీనివాస్ విదేశాలకు పరారవ్వడంతో ఐటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.