అమరావతి : జీతాల విషయంలో ఏపీ ఉద్యోగులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఒకపక్క కోరుతూనే పెరిగిన జీతాలు ఒకటో తేదీన వేస్తే అభ్యంతరాలు చేయడం ఏమిటని ఆయన ఆరోపించారు. సోమవారం సీఎంతో జరిగిన సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పీఆర్సీ, ఇతర సమస్యలపై చర్చించేందుకు నియమించిన సంప్రదింపుల కమిటీ మూడురోజుల పాటు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల కోసం ఎదురుచూసినా ఎవరూ రాలేదని పేర్కొన్నారు. దీంతో తాము ఉద్యోగ సంఘాలు కోరితేనే సమావేశానికి వస్తామని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
సమస్యలుంటే సమావేశానికి వచ్చి వివరిస్తే పరిష్కరించేందుకు వీలుంటుందని అలా కాకుండా దూరంగా ఉంటూ ఆందోళనలు నిర్వహిస్తే ఎవరికీ మంచిది కాదని అన్నారు. రాష్ట్రం కోసం సమష్టిగా అందరూ బాధ్యత వహించాలని సూచించారు. ఉద్యోగులతో చర్చించేందుకు తమకు ఎలాంటి భేసాజు లేవని అయితే కోర్కేలు సమంజసంగా, చట్టబద్ధంగా ఉండాలని, ఆర్థిక పరిస్థితులను అర్ధం చేసుకోవాలన్నారు. బాధ్యత గల ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్పై, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి పర్యవసనం కూడా ఉంటుందని పేర్కొన్నారు.
కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి అపోహాలు అవసరం లేదని బొత్స వివరించారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ఏపీ బకాయిలను, ఇతర పథకాల మంజూరు అంశాలను పార్లమెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం కోరుతుందని ఆయన వెల్లడించారు.