YS Sharmila | కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని విమర్శించారు. వైసీపీ పాలన ఓ విపత్తు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఐదేళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా అని నిలదీశారు.
ఆ ఐదేళ్లు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా.. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా అని అమిత్ షాను వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా అని నిలదీశారు. ఇష్టారాజ్యంగా రూ.10లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా ? సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. కేంద్ర హోం శాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా నిలదీశారు.
ఐదేళ్ల పాటు జగన్ మీకు దత్తపుత్రుడు.. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మగా వ్యవహరించారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్ అని విమర్శించారు. రాష్ట్రంలో సహజ వనరులను ‘మోదానీ’కి దోచిపెట్టే ఏజెంట్అని వ్యాఖ్యానించారు. మీ ఇష్టారాజ్యంగా ఐదేళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారని స్పష్టం చేశారు.
2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే… కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమని మండిపడ్డారు. పదేళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటామని.. రూ.3లక్షల కోట్లు ఇస్తామని.. పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనమని విమర్శించారు. మీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే.. మీకు దమ్ముంటే గత వైసీపీ పాలనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అమిత్ షాను డిమాండ్ చేశారు.