YS Sharmila | పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకమని తెలిపారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని విమర్శించారు. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే ఇదంతా అని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి.. ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.
ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ.. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని డిమాండ్ చేశారు.