Thota Chandrasekhar | దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రైతాంగ సమస్యలు అలాగే ఉన్నాయని.. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో పర్యటించిన తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దేశంలో తాగు, సాగు నీటి సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రానికి పట్టులేదని విమర్శించారు. ఇప్పటికీ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీలోనూ ఎన్నో సమస్యలు తలెత్తాయని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఏపీకి ఇంతవరకు రాజధాని లేదని.. పోలవరం ప్రాజెక్టులు పూర్తి కాలేదని గుర్తు చేశారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని పేర్కొన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఇప్పటికీ మెట్రో రైలు సౌకర్యం లేదని అన్నారు. దక్షిణాదిపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తుందని ఆయన ఆరోపించారు. వీటిపై కేంద్రాన్ని నిలదీసిన వాళ్లు లేరని అన్నారు. అదే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో అన్ని రాష్ట్రాల్లోనూ అభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రస్తుతం దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందని తోట చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నయంగా బలమైన పార్టీ అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో బీజేపీకి ప్రత్యామ్నయ పార్టీగా బీఆర్ఎస్ విస్తరిస్తుందని తెలిపారు. దేశంలో స్వశక్తితో బీఆర్ఎస్ బలమైన పార్టీగా రాబోయే ఎన్నికల్లో చూస్తారని అన్నారు.