మంగళగిరి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఉపసంహరించుకున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంది. మంగళవారం నాడు ఈ ఉపసంహరణ బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
గతంలో శాసనమండలిని రద్దు చేయాలని చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో కొత్త తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాసనమండలి రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారని, అయితే ఆ తీర్మానానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదని చెప్పారు.
కేంద్రం ఆమోదం కోసం పంపిన ఆ తీర్మానం గడిచిన 22 నెలలుగా అక్కడే పెండింగ్లో ఉందన్నారు. దీంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడిందని, ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకే ప్రస్తుత నిర్ణయం తీసుకున్నామని, తద్వారా శాసనమండలిపై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోతుందని బుగ్గన తెలిపారు. శాసనమండలిని యథాతథంగా కొనసాగించాలని కేందాన్ని మళ్లీ కోరుతామని పేర్కొన్నారు.