అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాలు వాయిదా పడ్డాయి. వరుసగా నాలుగురోజు పాటు జరిగిన సమావేశాలు జరిగాయి. శుక్రవారం హోళీ పండుగ శని, ఆదివారాలు సెలవు కావడంతో సభను మూడురోజుల పాటు వాయిదా వేశారు. తిరిగి అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఈరోజు కూడా సభలో నిరసనలు నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు.
ప్రశ్నోత్తరాలు సాగకుండా అడ్డుకోవడంతో టీడీపీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇకపై సెల్ఫోన్లు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని ఆదేశాలిచ్చారు. లోపల జరిగే యాక్టివిటీని రికార్డ్ చేసి బయట వ్యక్తులకు ఇస్తున్నారని స్పీకర్ అనుమానం వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు కూడా సెల్ఫోన్లు తీసుకుని వస్తున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. కొత్త రూల్ అందరికీ వర్తిస్తుందని తమ్మినేని పేర్కొన్నారు.
సభా కార్యక్రమాలకు అడ్డగించిన 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ ఒక రోజు పాటు సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్ చేశారు.