Leopard | తిరుమల (Tirumala) నడక మార్గంలో తాజాగా మరో చిరుత (Leopard) కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో 2450 వ మెట్టు వద్ద ఓ చిరుత భక్తులకు కనిపించింది. దీంతో వారు భయంతో కేకలు వేయడంతో అది అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నామాల గవి వద్ద చిరుత సంచరిస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న టీటీడీ (TTD), అటవీ శాఖ అధికారులు (Forest Officers) అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలికి చేరుకొని చిరుత జాడ కోసం గాలిస్తున్నారు.
మరోవైపు రెండు రోజుల క్రితం తిరుమల మెట్ల మార్గంలో చిన్నారి లక్షిత (Lakshitha) పై దాడి చేసి చంపిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కిన విషయం తెలిసిందే. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దదిగా అటవీ అధికారులు గుర్తించారు. బాలిక మృతిచెందిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల మూడు బోన్లతోపాటు సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి (Alipiri) కాలినడక మార్గంలోని (Step way) ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కిందని అధికారులు తెలిపారు. చిరుత చిక్కడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి సమయంలో మరో చిరుత కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నడకదారిలో వెళ్లాలంటే భయంగా ఉందంటూ ఆవేదన చెందుతున్నారు.
నడకమార్గంలో మరో ఐదు చిరుతలు తిరుగుతున్నాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిరుతలు సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. చిరుతల జాడ కోసం ఆపరేషన్ కొనసాగుతోందని.. వాటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలిపారు. వరుస చిరుతల సంచారం నేపథ్యంలో ఈరోజు 3 గంటలకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు. కాగా, తిరుమల ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ట్రాప్ కెమెరాల్లో చిరుతల దృశ్యాలు నమోదైనట్లు చెప్పారు.