అమరావతి : ఏపీలో రాజకీయ ఆరోపణలు జోరందుకుంటున్నాయి. నిన్న,మొన్నటి వరకు బంధువులుగా ఉన్న వారు నేడు ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బావ అయిన బ్రదర్ అనిల్ జగన్పై పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు.
2019 ఎన్నికలకు ముందు కలిసి కట్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్ను భారీ మెజార్టీతో గెలిపించిన వైఎస్ షర్మిల, భర్త బ్రదర్ అనిల్ ఐదేండ్లు గడిచేసరికి బద్ద శత్రువులయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అన్న జగన్పై విరుచుకుపడుతుండగా బావ అనిల్ ఆదివారం కడప రాజారెడ్డి వీధిలోని చర్చిలో ఆయన మాట్లాడుతూ జగన్పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పాపాలు చేసిన వారిని తొక్కి పడేయండని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి పిలుపునిచ్చారు.
పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన సరిపోదని, ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. తామంతా న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికీ భయపడకండి.. ఏసుప్రభు (Lord Jesus) అండగా ఉన్నాడని ధీమాను కల్పించారు. దేవునిపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.