అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్ష ఖరారు కానుంది. ఇప్పటికే నిందితుడు కుంచాల శశికృష్ణ పై హత్యానేరం రుజువైందని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. తన ఫోన్ నంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గత సంవత్సరం ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా నిందితుడు శశికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. హత్య ఘటనపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు.
హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును 29న తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. కేసు పుర్వాపరాలను పరిశీలించిన కోర్టు ఇవాళ మరోసారి పరిశీలించి మధ్యాహ్నం తీర్పును వెలువడించనున్నారు.