రూ.45 లక్షల 60వేలతో అభివృద్ధి పనులు
వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పనులు పూర్తి
వెల్లివిరుస్తున్న పచ్చదనం..పరిశుభ్రంగా గ్రామం
ఆత్మకూరు(ఎం), మే 8 : ప్రతి పల్లె అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిని చేపట్టింది. మండలంలోని కొరటికల్లో 502 ఇండ్లు ఉండగా 2200ల జనాభా, 1800ల ఓటర్లు ఉన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో గ్రామంలో రూ.45 లక్షల 60వేలతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.12 లక్షల 60 వేలతో వైకుంఠధామం, రూ.2 లక్షల 50వేలతో కంపోస్ట్ షెడ్ నిర్మాణం, రూ.26 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం, రూ.2లక్షలతో మురుగు కాలువలు, రూ.1లక్ష 50వేలతో వాటర్ ప్లాంట్ గది, రూ.1లక్షతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల వెంట 2500 మొక్కలు నాటి సంరక్షించడంతో నేడు ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకున్నాయి. అదేవిధంగా ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున 3వేల మొక్కలను పంపిణీ చేశారు.
పారిశుద్ధ్యానికి పెద్దపీట
పరిశుభ్రతలో భాగంగా ఇంటింటికీ చెత్త బుట్టలను ఉచితంగా పంపిణీ చేసి తడి, పొడి చెత్తను వేరు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి రోజు ప్రతి ఇంటి నుంచి గ్రామ పంచాయతీ ఆధ్వర్వంలో ట్రాక్టర్ ద్వారా సిబ్బంది చెత్తను సేకరించి కంపోస్ట్ షెడ్లో వేస్తున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులను శుభ్రపర్చడంతో పాటు మురుగు కాలువలను శుభ్రపర్చి బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో గ్రామం పరిశుభ్రంగా కనిపిస్తున్నది.
ప్రభుత్వ సహకారంతోనే..
ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో గ్రామం లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటును పూర్తి చేశాం. గ్రామ ప్రజల అవసరాల కోసం సీసీరోడ్ల నిర్మాణం, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాం. మున్ముందు గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రభు త్వం సహకారంతో చేపడతాం.
– కోల సత్తయ్యగౌడ్, సర్పంచ్, కొరటికల్
ఊరు మంచిగున్నది
గతంలో కంటే ఇప్పుడే ఊరు బాగుంది. ఈ రెండేండ్ల కాలంలో గ్రామం బాగా మారింది. రోడ్ల మీద చెత్త లేకుండా ఊడుస్తున్నరు. మట్టి రోడ్లన్నీ మాయం అయినయి. కొత్తగా సిమెంట్ రోడ్లు కూడా వేశారు. తాగు నీళ్లకు చానా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు రోజూ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి.
– చుంచు లక్ష్మి, గ్రామస్థురాలు, కొరటికల్
పచ్చదనం పెరిగింది
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో గ్రామాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో నేడు మా ఊరు సమగ్రంగా మారింది. అన్ని వర్గాల ప్రజల కోసం వైకుంఠధామం నిర్మించడం హర్షణీయం. గ్రామంలోని ప్రధాన వీధుల వెంట హరితహారంలో నాటిన మొక్కలన్నీ ఏపుగా పెరిగి పచ్చదనం వెల్లివిరస్తున్నది. పచ్చని మొక్కలతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం వచ్చింది. – సైదులు, గ్రామస్థుడు, కొరటికల్