నార్కట్పల్లి/చిట్యాల/బొడ్రాయిబజార్/ఏప్రిల్ 22 : అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం మిగిలింది. సూర్యాపేట, నార్కట్పల్లి, చిట్యాల, మోత్కూరు, ఆత్మకూర్.ఎం, గుండాల, రామన్నపేట తదితర మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. పండిన కొంత మేర పంట కూడా చేతికి దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నార్కట్పల్లిలో.. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసి ముద్దయ్యింది. అమ్మనబోలు ధాన్యం కొనుగోలు కేంద్రంలో టన్నుల కొద్ది ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు రాలాయి. చిన్నతుమ్మలగూడెంలో ఒక తోటలోని 21 నిమ్మచెట్లు విరిగిపడ్డాయి.
చిట్యాలలో.. మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు గంట సేపు ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్లు విరిగి పడ్డాయి. మామిడి కాయలు రాలిపోయాయి. వెలిమినేడుతోపాటు మరికొన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిశాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వర్షానికి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన ధాన్యం కొంత తడిసింది. యాసంగి సీజన్ మొదలు నుంచి మార్కెట్కు ధాన్యం భారీగా వస్తుండడంతో కమీషన్దారులు, మిల్లర్లు తేమ పేరుతో అమాంతం ధరలు తగ్గించి మద్దతు ధర కంటే తక్కువగా కోడ్ చేస్తున్నారు. దాంతో కొందరు ఇష్టం లేని రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోకుండా మార్కెట్లోనే ఆరబెట్టుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆదివారం అకాలంగా వచ్చిన వర్షంతో ధాన్యం తడిసింది.