Agriculture | న్యాల్కల్ : వరుసగా వానకాలం, యాసంగి రెండు పంటలు సాగుచేసిన తర్వాత భూమిలో సారం తగ్గుతుంది. ఆ తర్వాత మరో పంట సాగుచేస్తే దిగుబడి తక్కువగా వస్తుంది. దీని నివారణకు రైతులు వానకాలం పంట వేసే ముందు వేసవిలో దుక్కులు దున్నుకుంటే బహుళ ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది రైతులు ట్రాక్టర్లు, ఎడ్లతో తమ పొలాలను దుక్కులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుత ఎండల తీవ్రతకు భూమి బాగా కాగుతున్నది. దీంతో లోపలి క్రిములు నశించిపోతాయి. పంటలు వేసినప్పుడు క్రిమి కీటకాలు బెడద ఉండదు. మందుల పిచికారీ చేయాల్సి ఉంటుంది. వేసవిలో భూమిని దుక్కి దున్నకుండా వదిలిస్తే కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి. అవి భూమిలో నీటిని, పోషక పదార్థాలు గ్రహిస్తాయి. దీంతో భూమి లోపలి పొరల నుంచి నీరు ఆవిరై పోతుంది. తద్వారా భూసారం తగ్గుతుంది. దీంతో ఆ తర్వాత పంటలకు అవసరమైన పోషకాలు లభించక ఆశించిన దిగుబడులు రావు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మేలో కురిసే అకాల వర్షాలను ఉపయోగించుకొని భూమిని 25-30 సెంటీమీటర్ల లోతులో దుక్కిని చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు.
యాసంగి పంటల కోతల తర్వాత చాలామంది రైతులు భూమిని అలాగే వదిలేస్తారు. దీంతో ఖాళీ భూముల్లో కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పెరుగుతాయి. ఇవి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేసి, భూసారాన్ని తగ్గిస్తాయి. భూమిలోపలి పొరల్లోని నీరు ఆవిరైపోతుంది. వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వాననీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది. వర్షాలతో భూమి కోతకు గురవుతుంది. ఖాళీ భూముల్లో చీడపురుగులు భారీగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా రాబోయే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
వేసవిలోనే భూమిని లోతుగా దున్నడంతో వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా చేస్తుంది. భూమిని లోతుగా దున్నడంతో భూమిపై పొరలు కిందికి, కిందికి ఉన్న పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. భూమిలో తేమశాతం పెరిగి, భూసారం వృద్ధి చెందుతుంది. పురుగులు, తెగుళ్లు, కలుపు నివారణ చేసుకోవచ్చు. దుక్కులు దున్నేముందు పొలంలో గొర్రెలు, మేకలు, పశువుల మందలు తోలడం చేయించాలి. పొలంలో వాటి విసర్జన పదార్థాలు భూమిలో ఇంకి భూసార వృద్ధికి దోహదపడతాయి. వేసవి దుక్కులు దున్నే ముం దు పశువుల పెంటపోగు, కంపోస్టు ఎరువులు, చెరువులోని పూడిక మట్టిని వేయడంతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. పంటలు చేతికి వచ్చే ముందు ఎండు ఆకులు, చెత్త చెదారాన్ని కాల్చివేయకుండా వాటిని పొలంలోనే ఉంచి లోతుగా దుక్కులు చేయడంతో నేల పొరల్లో కలిసిపోయి ఎరువుగా మారుతుంది. తద్వారా భూసారం పెరిగి పంట కు కావాల్సిన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. వేసవిలో లోతుగా దున్నడంతో భూమిలో ఉన్న చీడపురుగుల గుడ్లు, లార్వాలను పక్షులు, కొంగలు, కాకులు తిని నాశనం చేస్తుంటాయి. భూమిలో ఉండే శిలీంద్ర బీజా లు మట్టిపైకి రావడంతో అధిక ఉష్ణోగ్రతతో వ్యాధి కలుగజేసే శక్తిని కోల్పోయి పంటలకు తెగుళ్లు సోకుకండా దోహదపడుతుంది. పంట లు లేని సమయంలో కలుపు మొక్కలు పెరిగి నేలలోని నీరు, పోషక పదార్థాలను గ్రహిస్తాయి. కలుపు మొక్కలు పంటల దిగుబడిని తగ్గిస్తుంటాయి. లోతుగా దున్నడంతో కలుపు మొక్కలు నేలపైకి వచ్చి అధిక ఉష్ణోగ్రతలతో నశిస్తాయి. ఫలితంగా తదుపరి పంటల సాగులో కలుపు మొక్కల తాకిడి బెడద తక్కువగా ఉంటుంది.
వానకాలం, యాసంగి సీజన్లలో పంటలు కోసిన తర్వాత తప్పనిసరిగా పొలాన్ని దున్నాలి. వేసవిలో పొలాన్ని దున్నడంతో పంటల దిగుబడికి ఎంతో ఉపయోగపడుతుంది. పంటలకు నాశనం చేసే పురుగులు నాశనమవుతాయి. దుక్కులు చేసే ముందు పశువుల పెంటపోగు, సేంద్రియ ఎరువులను వేస్తే పొలానికి మరింత బలం వస్తుంది. ఫలితంగా పంటల అధిక దిగుబడికి దోహదపడుతుంది. రైతులు తప్పనిసరిగా వేసవి దుక్కులు చేపట్టాలి.
– లావణ్య, మండల వ్యవసాయాధికారి, న్యాల్కల్ (సంగారెడ్డి జిల్లా)