పార్థసారధి నారా.. లక్షలు సంపాదించి పెట్టే సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి పలుగు, పారా పట్టాడు. వ్యవసాయం నేర్చుకొని ఇప్పుడు వందల మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయాన్ని కూడా ఎలా లాభసాటిగా మార్చవచ్చో చేసి చూపించాడు. సహజ సిద్ధంగా పంటలు పండించి అక్కడి రైతులకు కూడా మెళకువలు నేర్చించి.. ప్రస్తుతం వ్యవసాయంలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. పార్థసారధిది ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ఉప్పనేసినపల్లి. నిజానికి పార్థసారధిది వ్యవసాయ కుటుంబమే. తన తాతల కాలం నాటి నుంచి వ్యవసాయమే చేసేవాళ్లు. అప్పట్లో వాళ్లకు 90 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. కానీ.. వ్యవసాయం చేసి వాళ్లు సంపాదించింది మాత్రం ఏం లేదు.
రాను రాను వ్యవసాయంలో మార్పులు చోటు చేసుకోవడం.. కెమికల్స్ వాడకం పెరగడంతో వ్యవసాయానికి పెట్టే పెట్టుబడి కూడా పెరగడంతో పెట్టుబడులు పెరగడం తప్పితే.. వ్యవసాయం వల్ల వచ్చిందేమీ లేదు. అందుకే.. పార్థసారధి తన తాత, తండ్రిలా వ్యవసాయం చేయకుండా.. పెద్ద చదువులు చదివాడు. వ్యవసాయం వల్ల తన తండ్రి చేసిన అప్పులను తీర్చడం కోసం కష్టపడి చదవి మంచి ఉద్యోగం సంపాదించాడు. సాఫ్ట్ వేర్ కొలువులో చేరాడు. యూఎస్ కు వెళ్లాడు. అక్కడే కొన్నేళ్లు పనిచేసి 2008లో ఇండియాకు తిరిగొచ్చేశాడు. దానికి కారణం ఆయనకు వ్యవసాయంపై ఇష్టం పెరగడం.
బెంగళూరులో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే ప్రతి వీకెండ్ తన ఊరికి వెళ్లి వ్యవసాయం పనులు చూసుకునేవాడు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను తెలుసుకొని వాటిని పాటిస్తూ వ్యవసాయం చేస్తుండేవాడు. తన ఊళ్లోనే కొంత భూమి కౌలుకు తీసుకొని రకరకాల పంటలు వేసేవాడు. అప్పుడే సహజ సిద్ధంగా పంటలు పండించడం గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతుండటంతో.. కెమికల్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం కన్నా.. నాచురల్ గా పంట పండించాలన్న ఆలోచన కలిగింది పార్థసారధికి.
2013 లో నాచురల్ ఫార్మింగ్ పై శిక్షణ తీసుకొని కెమికల్స్ ఉపయోగించకుండా.. కేవలం జీవామృతంతో పంటలు పండించడం మొదలు పెట్టాడు. అన్ని రకాల కూరగాయలు, పండ్లను నాచురల్ గా పండించడం మొదలు పెట్టాడు. దీని వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గింది. రాబడి పెరిగింది. దిగుబడి కూడా ఎక్కువగా వచ్చింది. దీంతో మరింత భూమిని కౌలుకు తీసుకొని ఎక్కువగా కూరగాయల పంటలు, అన్ని రకాల పండ్లను పండించడం మొదలు పెట్టాడు. ఇదంతా ఓవైపు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే సాధించడంతో.. మరింత ఫోకస్ పెట్టడం కోసం ఉద్యోగం వదిలేసి.. అనంత నాచురల్స్ అనే కంపెనీని స్థాపించాడు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులందరికీ సహజ సిద్ధంగా పంటలు ఎలా పండించాలో శిక్షణ కూడా ఇచ్చాడు పార్థసారధి. అలాగే.. అనంత నాచురల్స్ కంపెనీ ద్వారా బెంగళూరులో పలు ఔట్ లెట్స్ ను ప్రారంభించి సహజసిద్ధంగా పండించిన పండ్లు, కూరగాయలను అమ్మడం ప్రారంభించి సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో 150 మందికి పైగా రైతులు పార్థసారధి బాటలో నడుస్తూ సహజ సిద్ధంగా పంటలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఎక్కడో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే పార్థసారధి.. ఇక్కడి రైతులకు వ్యవసాయ మెళకువలు నేర్పించి.. వాళ్లకు మార్గదర్శి అయ్యాడు.