రాష్ట్రంలోని రైతులు వరి నుంచి ఇతర పంటల వైపు దృష్టి పెడుతున్నారు. ఒకేపంటను నమ్ముకోకుండా, అంతర పంటల సాగు ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఆయిల్ పామ్ తోటల్లో ఇతర పంటలను సాగు చేస్తూ, లాభాలను గడిస్తున్నారు.
ఆయిల్పామ్ సాగు అన్ని కాలాలకూ అనుకూలం. తకువ పెట్టుబడితో 30 ఏళ్ల వరకూ స్థిరమైన ఆదాయం ఉంటుంది. తకువ పెట్టుబడితోనే ఎకువ లాభాలు పొందవచ్చు. ఎకరానికి 10-12 టన్నుల దిగుబడి ద్వారా, నికరంగా రూ.లక్ష దాకా సంపాదించవచ్చు. అయితే, పంట వేసిన నాలుగేండ్ల తర్వాతే దిగుబడి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడేండ్లపాటు అంతర పంటలను సాగుచేయడం వల్ల అధిక లాభాలను ఆర్జించవచ్చు. సిద్దిపేట జిల్లా లక్ష్మీదేవిపల్లికి చెందిన దండు ప్రభాకర్ అనే రైతు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆయిల్పామ్ తోటల్లో పలు రకాల కూరగాయలు సాగు చేస్తూ, సుస్థిర ఆదాయం పొందుతున్నారు.
ప్రభాకర్ నాలుగెకరాల్లో ఆయిల్పామ్ సాగుచేస్తున్నారు. ఎకరానికి 57 చొప్పున 228 మొక్కలు నాటారు. వీటి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో అంతరపంటగా చిక్కుడు, టమాట, బెండ, పాలకూర, ముల్లంగి వేశారు. వీటి ద్వారా ఎకరానికి రూ.2లక్షల 60వేల అదనపు ఆదాయాన్ని ఆర్జించారు. గతంలో ఈ నాలుగు ఎకరాల్లో కూరగాయల సాగు చేసేవారు. అప్పుడు కూడా ఇదే ఆదాయాన్ని పొందేవారు. అదే విధంగా యాసంగిలో అంతరపంటగా రెండెకరాల్లో ఉల్లిగడ్డ, క్యారట్, టమాట, బెండ వేశారు. మరో రెండు ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు చేశారు. ఆయిల్పామ్ చేతికి వచ్చే వరకూ, అంతరపంటగా వేసిన కూరగాయల ద్వారా ఆదాయం పొందుతున్నానని చెబుతున్నారు.
రైతుకు లాభం..
వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట్ మండలంలో 360 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయడానికి రైతులను గుర్తించాం. అయితే, ఈ పంట సాగు చేస్తే మొదటి మూడేండ్లు ఎలాంటి దిగుబడీ రాదు. నాలుగో ఏడాది నుంచి దిగుబడి మొదలై, 30 ఏండ్ల వరకూ వస్తుంది. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రైతులు అంతరపంటలుగా కూరగాయలను సాగు చేసుకోవచ్చు. జిల్లాలో ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులంతా అంతర పంటలు వేసుకొనేలా ప్రోత్సహిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రధాన పంటలకన్నా ఎక్కువగా, అంతరపంటలతోనే మంచి ఆదాయం పొందుతారు. – నాగరాజు, వ్యవసాయ విస్తరణ అధికారి.