CM KCR | నర్సింహులపేట, ఏప్రిల్ 10 : తెలంగాణలో వ్యవసాయరంగానికి ప్రాజెక్టుల నిర్మాణంతో సీఎం కేసీఆర్ జీవం పోశారు. పుష్కలంగా సాగునీరు, 24గంటల నిరంతర విద్యుత్, రైతుబంధుతో పెట్టుబడి సాయం, భరోసానిచ్చే రైతుబీమా, పొలాల్లోనే పంట కల్లాలు, పల్లెల్లోనే పంట కొనుగోళ్లు, సమావేశమయ్యేందుకు రైతువేదికలు ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. ఒకప్పుడు రెండు పంటలు పండించడమే గగనమైన పరిస్థితి ఉండగా అన్ని అనుకూలతలు ఉండి, వ్యవసాయాధికారుల సూచనలు తోడవడంతో ఇప్పుడు ఉత్సాహంగా మూడో పంట వేసే స్థాయికి రైతులు ఎదిగాడు. వరి కంటే తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి, లాభాలు తెచ్చిపెట్టే వేరుశనగ, కూరగాయలు, పప్పుదినుసులు పండిస్తున్నారు. ఒక్క మానుకోట జిల్లాలోనే ఈసారి (యాసంగి తర్వాత) 1800 ఎకరాల్లో మూడో పంట వేసి సాగులో మార్పుతో సత్ఫలితాలు సాధిస్తున్నారు.
సాగును అభివృద్ధి చేయడంలో సీఎం ఆలోచన, నిర్ధిష్టమైన ప్రణాళిక, క్రమబద్ధమైన కార్యాచరణ కనిపిస్తున్నది. పంట భూమిపై రైతుకు హక్కును ఖరారు చేయడం మొదలు పండిన పంటను ప్రభుత్వమే పల్లెకు వెళ్లి కొనేదాకా అంతా పద్ధతి ప్రకారం జరుగుతోంది. వ్యవ సాయానికి 24గంటల నాణ్యమైన కరెంట్, పంటసాగుకోసం కాళేళ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, భూగర్భ జలాలు పెంచేందు కు చెక్డ్యాముల నిర్మాణం, సాగుకు సలహాలు ఇచ్చే వ్యవసాయ విస్తరణాధికారులు, మంచీచెడ్డ మాట్లాడ్లుకునేందుకు రైతువేదిక లు, దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి భరోసాని చ్చేలా రూ.5లక్షల ఇన్సురెన్స్, ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సా యం. ఎక్కడ పడితే అక్కడ రోడ్లుపై ధాన్యం ఇతర పంటలు ఆర బెట్టకుండా రైతుల పొలాల్లోనే కల్లాల నిర్మాణం, ఇలా చెప్పు కుంటే పోతే వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతన్నకు వెన్నుదన్నుగా ఉంటోంది కేసీఆర్ సర్కారు.
విత్తనం రకాలు..
జిల్లాలో ఎక్కువగా కదిరి, కదిరి లేపాక్షితో పాటు నాటు రకాలు సాగు చేసుకోవచ్చు. యాసంగిలో కదిరి లేపాక్షి అధిగ దిగుబడినిస్తుందని అధికారులు చెబుతుండడంతో రైతులు ఎక్కువ ఈ రకాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వేరుశనగ వేసిన రైతులు జింక్ లోప నివారణకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. కలుపు నివారణకు అంతర కృషి చేసుకోవా లని అధికారులు సూచిస్తున్నారు.
అధికారుల ప్రోత్సాహంతో..
జిల్లావ్యాప్తంగా రైతులు మూడో పంటగా వేరుశనగతో పాటు పప్పు దినుసుల పంటలు పండిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు.వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సీఎం కేసీఆర్ తానే ముందుకొచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం సంతోషదాయకం. రైతులకు వరి కంటే యాసంగిలో వేరుశనగ, కూరగాయలు, పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యలతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి, లాభాలు వచ్చే పంటల సాగును వ్యవసాధికారులు ప్రోత్సహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే యాసంగి పంట తర్వాత మళ్లీ మూడో పంటగా వేరుశనగ సాగుచేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వేరుశనగ పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంది. జిల్లావ్యాప్తంగా 1800 ఎకరాల్లో మూడో పంటగా వేరుశనగ సాగు చేస్తున్నారు. దీనికి తోడు వానకాలం వరి, పత్తి సాగుచేసిన రైతులు పొలాల్లో యాసంగి పంటగా పెసర, మినుములు, మక్కజొన్న సాగుచేశారు. అకాల వర్షంతో ముందస్తుగా రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు.
తక్కువ నీటితో సాగు..
వేరుశనగ పంటను తక్కువ నీటితో సాగు చేసుకోవచ్చు. 7 నుంచి 10రోజుల వ్యవధిలో నీరు అందించాల్సి ఉంటుంది. తగిన తేమ ఉన్న తరువాతే విత్తనం వేసుకోవాలి. విత్తిన 20,25 రోజుల తరువాత నీరు అందించాలి. తుంపర్లు(స్ప్రింక్లర్లు) ద్వారా నీరు అందిస్తే నీరు ఆదా అవుతుంది. కాయ ఊరిన తరువాత పంట కోతకు 15 రోజుల ముందు నీటి అందించి తెంపుకోవాలి.
సస్యరక్షణ ఇలా..
ఎర్రగొంగళి, వేరు పురుగు, ఆకు ముడుత, పొగాకు లద్దె పురుగు పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు నివారణకు సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎర్రగొంగళి పురుగు నివారణకు వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలి. వేరు పురుగు నివారణకు విత్తే సమయంలో పొరేట్ గుళికలు వేసుకోవాలి. ఆకు ముడుత నివారణకు యూరియా ఎక్కువ వేయకూడదు. పొగాకు లద్దెపురుగు, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు నివారణ కోసం మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు, లీటర్ వేపనూనె, సబ్బు పొడి కలిపి పంటపై పిచికారీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
నాలుగేళ్లుగా సాగుచేస్తున్నా..
సాగునీటికి ఇబ్బంది లేదు. వానకాలంలో పెసర, యాసంగిలో వేరు శనగ వేసి దుక్కులు చేసుకొని మూడో పంటగా వేరుశనగ పండిస్తున్నా. బావినిండా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మా గ్రామంలోని కుంట నిండి అలుగు పోస్తున్నది. దీంతో సాగునీటికి రంది లేదు. నాలుగేళ్లుగా మూడో పంట కింద వేరుశనగే వేస్తున్నా. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాల్కు రూ.7వేలు ఉంటే రూ.70వేల వరకు ఆదాయం వస్తుంది. రూ.30వేల వరకు ఖర్చులు పోతే రూ.40వేల వరకు మిగులుతుంది.
– ఇర్రి ప్రభాకర్, రైతు, పడమటిగూడెం
సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి
యాసంగి, మూడో పంటగా వేరుశనగ పంటను మండలంలోని పడమటిగూడెం గ్రామంలో సుమారు 260 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. నూనె గింజల పంటలకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉంది. వేరుశనగ పంటలో వచ్చే చీడ పీడల నివారణకు రైతులకు సస్యరక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. వేరుశనగ పూత, పిందె దశలో జిప్సం వాడితే కాయ గట్టిపడి తూకం వస్తుంది.
– రామకృష్ణ, ఇన్చార్జి ఏవో