Agricultural Drone | హనుమకొండ సబర్బన్, మార్చి 13 : వ్యవసాయంలో 20 ఏండ్ల క్రితం వరి కోత మిషన్లను వినియోగించినప్పుడు అనేక మంది పెదవి విరిచారు. ఇప్పుడు వరికోత మిషన్ లేకుండా వరి పంట లేని పరిస్థితి వచ్చింది. అదే విధంగా రెండు, మూడేళ్ల క్రితం వ్యవసాయ రంగంలోకి పురుగుమందుల పిచికారీ కోసం ప్రవేశించిన డ్రోన్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. గతేడాది హనుమకొండ జిల్లాలో ఈ డ్రోన్లు ఒకరిద్దరు రైతుల వద్దే ఉండగా ఇప్పుడు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రోన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇప్పుడు డ్రోన్ల సంఖ్య 11కు చేరింది. అనేక గ్రామాల్లో రైతులు మక్క ఇతర పంటల్లో డ్రోన్ల సహాయంతో పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచేందుకు ఇటు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో డ్రోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కొందరు ఔత్సాహిక దళిత రైతులు కూడా దళితబంధు పథకంలో డ్రోన్లను కొనుగోలు చేసి, కిరాయికి నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. డ్రోన్ను వినియోగించి పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల బహుళ ప్రయోజనాలు కనిపించడంతో దీన్ని వాడేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఎకరాలకు డ్రోన్ ద్వారా మందును పిచికారీ చేయవచ్చు. అంతేకాకుండా పురుగు మందు సైతం ఆదా అవుతుంది. డ్రోన్ సాయంతో రోజుకు 16 నుంచి 20 ఎకరాల వరకు పిచికారీ చేయవచ్చు. పెట్టుబడి ఖర్చు కొంత మేర తగ్గుతుంది.
కేవలం పురుగుమందు పిచికారీ మాత్రమే కాకుండా పంటలో తెగుళ్లను కూడా డ్రోన్లో అమర్చిన ప్రత్యేక కెమెరా గుర్తిస్తుంది. పంట దిగుబడి అంచనాలను కూడా వేసుకోవచ్చు. డ్రోన్తో పిచికారీ చేస్తే పురుగు మందు కూడా పంట పొలంలో అంతటా ఒకే రీతిన పడుతుంది. పది మంది రైతులు చేసే పనిని డ్రోన్తో చేయవచ్చు. పురుగుమందులను పిచికారీ చేసే సందర్భాల్లో అస్వస్థతకు గురై చనిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ సమస్యకు డ్రోన్తో పరిష్కారం దొరుకుతుంది. గతంలో కంటే ఇప్పుడు డ్రోన్లలో అనేక మార్పులు తెచ్చారు. పైలెట్ కంట్రోలర్, రెక్కలు, చార్జర్, బ్యాటరీ సామర్థ్యం, అధునాతన కెమెరాలు, నాజిల్స్, మెమొరీ కార్డులు లేటెస్ట్ వెర్షన్లవి అమర్చుతున్నారు. అంతకు ముందు పొలం సమీపంలో ఉండే ట్రాన్స్ఫార్మర్ల వద్ద బ్యాటరీలను చార్జింగ్ చేసేకునే వారు. ఇప్పుడు మినీ జనరేటర్లను వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) సహకారంతో ఆగ్రోస్ కేంద్రాల్లో డ్రోన్లను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది. ఇదే జరిగితే రైతులకు డ్రోన్లు మరింతగా అందుబాటులోకి రానున్నాయి.
మొదట్లో మాకు మాత్రమే డ్రోన్ ఉండేది. ఇప్పుడు అనేక మంది డ్రోన్లను కొనుగోలు చేసి పురుగుమందుల పిచికారీకి వినియోగిస్తున్నారు. దీని వల్ల మాకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎక్కువ మొత్తంలో డ్రోన్లు ఉండడం వల్ల మాకు కొంత మేరకు ఒత్తిడి తగ్గింది. డ్రోన్లు పెరుగుతున్న కొద్దీ రైతుల్లో అవగాహన కూడా పెరుగుతోంది. ఇప్పుడు బ్యాటిరీ చార్జింగ్కు కూడా ఇబ్బందులు లేకుండా చిన్న జనరేటర్ను వెంట తీసుకు వెళ్తున్నాం.
– నాంపల్లి రమేశ్, డ్రోన్ యజమాని
నేను ఐదెకరాల్లో వరి పొలం సాగు చేస్తున్నా. అవసరం ఉన్నప్నుడు పురుగు మందులను పిచికారీ చేయడం ఇబ్బందిగా మారింది. కూలీలు సరైన సమయంలో దొరకడం లేదు. దీంతో డ్రోన్తో మందులు పిచికారీ చేయిస్తున్నా. దీని వల్ల సమయం ఆదాతో పాటు, తక్కువ మందు పడుతుంది. మాకు అందుబాటులో డ్రోన్ ఉంది. ఫోన్ చేయగానే నేను పొలం వద్ద లేకున్నా మందులు పంపిస్తే చాలు వాళ్లే వచ్చి పిచికారీ చేసి పోతారు.
– గుండా ప్రతాప రెడ్డి, రైతు, దామెర