నిర్మల్ టౌన్, జూన్ 5 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాలో విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవానికి జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి హాజరయ్యారు. జిల్లా పర్యవేక్షక ఇంజినీరు జయంత్రావు చౌహాన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో 2014కు ముందు తెలంగాణలో విద్యుత్, 2023 తర్వాత విద్యుత్ అనే అంశంపై డాక్యుమెంటరీ, వీడియోగ్రఫీతో తీసిన విజయగాథలను ప్రత్యేక తెరపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో నిర్మల్ జిల్లాలో విద్యుత్ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. 400 కేవీ విద్యుత్ సబ్స్టేషన్తో పాటు 200 కేవీల విద్యుత్ సబ్స్టేషన్లు, 83 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ఉచిత కరెంటును వినియోగించుకోని పంటలు పండించుకుంటున్నారన్నారు.
పరిశ్రమల్లో కూడా విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. 2014కు ముందు వ్యవసాయరంగానికి కేవలం 9 గంటల కరెంటు ఇవ్వగా ఇప్పుడు 24 గంటలు ఇస్తుండడంతో జిల్లాలో పంటల ఉత్పత్తి 200 రెట్లు పెరిగిందని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాకే చీకటి బతుకుల్లో వెలుగులు నిండాయని ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు, నాయీబ్రహ్మణులు, రజకులకు 200 యూనిట్లులోపు, పారిశ్రామిక రంగానికి ప్రత్యేక లైన్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో ఇదంతా సాధ్యమైందని విద్యుత్ నిపుణులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, ఆర్డీవో స్రవంతి, విద్యుత్శాఖ పర్యవేక్షక ఇంజినీరు సుశిల్కుమార్, ఈఈ రామారావు, జిల్లా భూగర్భజలశాఖాధికారి శ్రీనివాస్బాబు, ఏడీఏ రమేశ్, నాయకులు చంద్రశేఖర్, నర్సారెడ్డి, విద్యుత్శాఖ అధికారులు మధుకర్రావు, నాగారావు, రత్నకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్శాఖలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు.
ఉచిత కరెంటుతో రైతులకు మేలు : వరుణ్రెడ్డి, కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్తో ఎంతో మేలు జరిగింది. గతంలో 9 గంటల కరెంటు రెండు దఫాల్లో ఇవ్వడంతో ఐదెకరాలకు మించి భూమి సాగు చేసుకునే అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఒక రైతు 15 ఎకరాల్లో పంటను పండిస్తున్నాడు.ఖరీఫ్, రబీ సీజన్లో జిల్లాలో సగటున 4.50లక్షల పంటల సాగైతే 3లక్షల వరకు ఉచిత కరెంటుపైనే రైతులు ఆధారపడి పంటలు పండిస్తున్నారు. రైతుల్లో భరోసా కల్పించింది సీఎం కేసీఆరే.
9ఏళ్లలో 50వేల కనెక్షన్లు : జయంత్రావు చౌహాన్,
జిల్లా విద్యుత్శాఖ అధికారి
2014కు ముందు నిర్మల్ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లు కేవలం 26వేలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ కనెక్షన్ల సంఖ్య 68వేలకు పెరిగింది. వ్యవసాయరంగానికి 24 గంటల కరెంటు ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున బోర్లు వేసుకొని పంటలు పండిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇస్తున్నాం. మంత్రి సహకారంతో జిల్లాకు మరో 8 విద్యుత్సబ్స్టేషన్లు మంజూరయ్యాయి.
ఏసీ రూముల్లో వ్యాపారం చేసుకుంటున్నాం
మాది నిర్మల్ పట్టణం శాంతినగర్ కాలనీ. 20 ఏళ్ల నుంచి సెలూన్ షాపు నడుపుతున్న. గతంలో కస్టమర్లు వస్తే కరెంటు ఉండేది కాదు. తెలంగాణ వచ్చాక నిరంతర కరెంటుతో పాటు నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నారు.దీంతో ప్రతి షాపులో ఏసీ, ఫ్యాన్లు 24 గంటలు పని చేస్తున్నాయి. దీంతో కస్టమర్లతో మాకు ఎలాంటి ఇబ్బంది ఎదురవడం లేదు. ప్రభుత్వమే బిల్లు చెల్లించడంతో మాకు రూ. 3వేల వరకు మిగులుతున్నది. ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటాం.
శ్రీనివాస్, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు
బొగ్గు పెట్టెలు పోయినవి…
రజకులకు ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తుండడంతో నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇస్త్రీ చేసే రజకులు బొగ్గు పెట్టేలు మానేసి కరెంటుతో పెట్టెలు వాడుతున్నారు. గతంలో బొగ్గు పెట్టేతో ఇస్త్రీ చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉండేవి. నిప్పు రవ్వలు బట్టలపై పడితే వినియోగదారులు కోపానికి వచ్చేవారు. ఇప్పుడు ఉచిత కరెంటు వల్ల ఆ పరిస్థితి లేదు. ఒక్కో షాపులో ఇస్త్రీ పెట్టెల వాడకం వల్ల రూ. 3వేల వరకు బిల్లు వస్తున్న ప్రభుత్వమే చెల్లిస్తున్నది. మాకు చాలా సంతోషంగా ఉంది.
చాకలి భోజన్న, లాండ్రీ షాప్ నిర్వాహకుడు
నేడు మూడు వ్యాపారాలు
మాది లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామం. పదేళ్ల క్రితం మాకు పిండి గిర్ని ఉండే. అప్పుడు పగటిపూట కరెంటు లేకపోతే రాత్రిపూటే గిర్నీ పట్టేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ లేదు. 2012లో గల్ఫ్కు వెళ్లినా అక్కడ ఉపాధి సరిగా లేకపోవడంతో 2014లో తిరిగి ఇంటికి వచ్చిన. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడంతో పిండి గిర్నీతో పాటు మినీ రైస్మిల్, ఆయిల్మిల్ ఏర్పాటు చేసుకున్న. 24 గంటల కరెంటు ఇవ్వడంతో మూడు వ్యాపారాలతో మా కుటుంబం బాగా స్థిరపడటమే కాకుండా మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నా.
సత్యనారాయణ, పారిశ్రామికవేత్త, నిర్మల్
కేసీఆర్ హయంలోనే విద్యుత్ మెరుగు
నేను 30 ఏళ్ల నుంచి విద్యుత్శాఖలో ఇంజినీర్గా పని చేస్తున్న. 2014కు ముందు ఆఫీసుకు రావాలంటనే భయమేసేది. ఎప్పుడు రైతులు వస్తారో..కరెంటు కోసం ఎక్కడ గొడవ చేస్తారో భయమేసేది. రైతులు కనిపిస్తే కార్యాలయానికి వెళ్లకుండా తప్పుకునే పరిస్థితి. ఇప్పుడు మేము వెళ్తుంటే రైతులే మా దగ్గరికి వచ్చి దండం పెడుతున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగానికి ప్రాధాన్యతనిచ్చి సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.
శ్రీనివాస్రావు, ఇంజినీర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధికారి