హాజీపూర్, పిభ్రవరి 16 : ‘కనీస గౌరవం ఇవ్వడం లేదు. అధికారిక కార్యక్రమాలకు పిలువడం లేదు’. అంటూ బీఆర్ఎస్ జడ్పీటీసీలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే.. ఎమ్మెల్యే కార్యక్రమాలకు పిలువడం లేదని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని, అధికారులు సైతం అదే బాటలో పోతున్నారని మండిపడ్డారు. దీంతో కలెక్టర్ బదావత్ సంతోష్ జోక్యం చేసుకొని.. ఇకపై అలా జరగకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో సమావేశం కొనసాగింది. 11.30 గంటల దాటినా ఎజెండా కాఫీలను సభ్యులకు ఎందుకు ఇవ్వలేదంటూ జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఒక్క రోజు ముందే ఇచ్చేవారని జడ్పీ సీఈవోను నిలదీశారు. మరోసారి ఇలా జరగకుండా చూడాలని నూతన జడ్పీ సీఈవో గణపతిని కలెక్టర్ ఆదేశించారు. మొదట వ్యవసాయ శాఖ పురోగతి పై చర్చించాల్సి ఉండగా జిల్లా వ్యవసాయ అధికారి అందుబాటులో లేక పోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి పత్తి తీసుకవచ్చి అమ్ముతున్నారని దీనికి మార్కెటింగ్ శాఖ అధికారులు సహకరిస్తున్నారని, జిల్లా రైతుల మద్దతు ధర కంటే 500 రూపాయలు తక్కువ చెల్లిస్తున్నారని ఇదేంటిని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ మార్కెటింగ్ శాఖ ఏడీ గజానంద్ను నిలదీశారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఏడీ తెలిపారు.
లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య మాట్లాడుతూ రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రైతు బంధు ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని జిల్లా వ్యవసాయ అధికారి కల్పనను ప్రశ్నించారు. హారికల్చర్ అధికారులు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. బెల్లంపల్లిలో మామిడి మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి, నెన్నెల, కన్నెపల్లి మండల జడ్పీటీసీలు కలెక్టర్ను కోరారు.
గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయకుండా ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని, కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఫారెస్ట్ చెక్పోస్టుల వద్ద వాహనాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని, భారీ వాహనాలను రాకుండా అడ్డుకుంటున్నారని జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. గ్రామాల్లో వంగి పోయిన విద్యుత్ స్తంభాలను సరి చేయడం లేదని, డీడీలు కట్టి నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోవడం లేదంటూ విద్యుత్ శాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వానకాలానికి సంబంధించిన ధాన్యాన్ని ఇతర జిల్లాల మిల్లులకు పంపారని, ఎంత పంపారనేది లెక్కలు లేవని, ఇందులో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, విచారణ చేపట్టాలని కలెక్టర్ను కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్, జడ్పీ సీఈవో గణపతి, కార్యాలయ సూపరింటెండెంట్లు బాలకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.