జైనథ్, డిసెంబర్ 1 : శ్రీలక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక బహుళ పంచమిని పురస్కరించుకొని జైనథ్లో శుక్రవారం రథోత్సవం కనుల పండువగా సాగింది. శ్రీమన్నారాయణ నామస్మరణతో జైనథ్ మార్మోగింది. మహారాష్ట్ర, హైదరాబాద్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. ముందుగా రథం ముందుర భక్తులు పురాతన ఆలయంలో దాచిన బల్లెంలను రంగు రంగుల పూలతో అలంకరించి, ప్రత్యేక వస్త్రధారణతో రథం ఎదుట యుద్ధ సైనికుల్లా నిలబడ్డారు. రథోత్సవ శోభాయాత్రను తిలకించారు.
స్వామి వారి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు హోమం, పూర్ణకుంభం పూజలు నిర్వహించారు. వేద పండితులు ధీరజ్కుమార్ ఆధ్వర్యంలో జై శ్రీమన్నారాయణ అంటూ భక్తులు రథాన్ని ముందకు కదిపారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చి, స్వామి వారిని దర్శించుకున్నారు. మహిళలు భజన, సంకీర్తన కోలాటాలతో శోభాయాత్ర సాగింది.
సమీప ఆంజనేయ స్వామి వద్ద నిర్మించిన ఓ మండపానికి థం తగలగానే యుద్ధం సమాప్తి అయినట్లుగా భావించి,శోభాయాత్రను తిరిగి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. రథానికి జాతర సందర్భంగా ఐదు రోజుల పాటు భక్తులు ప్యాలాలు, పుట్నాలు చల్లుతూ కొబ్బరికాయలు కొడుతూ పూజలు నిర్వహిస్తారు. సామాజిక కార్యకర్త బండారి దేవన్న, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, రైతుబంధు కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, టెంపుల్ ఈవో వామన్రావ్, మాజీ ఎండోమెంట్ చైర్మన్ పీ వెంకట రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు సీవకరించారు. ఆయన వెంట సీఐ కోల నరేశ్, ఎస్ఐ పురుషోత్తం, నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, గణేశ్ యాదవ్, లస్మన్న, సంజీవ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.