మామడ/భైంసా, మార్చి 21 : తెలుగు వారికి ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ పదానికి యుగాది అనే సంస్కృత పదం. యుగాది అంటే యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి విస్తృత రూపమే ఉగము, దీని నుంచి పుట్టినదే ఉగాది. ప్రస్తుతం ఉన్న ఫాల్గుణ మాసం, శుభకృత నామ సంవత్సరం మార్చి 21న ముగిస్తుంది. ఆ తర్వాత మార్చి 22 నుంచి చైత్రమాసం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే శ్రీ శోభకృత నామ సంవత్సరం మొదలవుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగను జరుపుకుంటాం. చైత్రమాసం ప్రారంభమయ్యే మొదటి రోజుని ఉగాదిగా జరుపుకుంటాం. శోభకృత నామ సంవత్సరంలో మార్చి 22వ తేదీన బుధవారం రోజు ఉగాది పండుగను నిర్వహించుకుంటాం.
భవిష్యత్ను తెలిపే పంచాంగం
ఉగాది పండుగ రోజు తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం చేస్తారు. దీంతో శరీరానికి కలిగిన దోషలు తొలగిపొతాయని అర్థం. అదే విధంగా ఆనందంగా ఉండేందుకు నూతన వస్త్రాలు ధరించడం సంప్రదాయం. ఏడాది పాటు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని ఆరగిస్తారు. దేవాలయాల్లో పురోహితులు చదివే పంచాంగ శ్రవణం వింటారు. పంచాంగం అనగా ఐదు అంగములు కలదని అర్థం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరుణలను పంచాంగాలంటారు. ఈ పంచాంగలే మనిషి మనుగడకు శాసిస్తుంటాయని శాస్త్రం చెబుతుంది. సంవత్సరంలో వీటి గమనం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. తిథిని గమనించి పనులు చేస్తే సిరిసంపదలు కలుగుతాయి. మంచివారం పనులు ప్రారంభిస్తే ఎంతో మేలు జరుగుతుంది. నక్షత్రలు బట్టి పాపలు నశిస్తాయి.
షడ్రుచులతో పచ్చడి
ఉగాది పండుగ అంటే గుర్తుకు వచ్చేది ఆరు రుచులు(షడ్రుచుల)తో కూడిన పచ్చడి ప్రత్యేకం. చేదు(కషాయం), పులుపు(ఆమ్లం), తీపి (మధురం), వగరు(తిక్త), కారం(కటు), ఉప్పు(లవణం) వంటి ఆరు రుచులు కలిగిన సమ్మేళనమే ఈ ఉగాది. పసుపుదారంతో మామిడి ఆకులతో తయారు చేసిన కంకణాన్ని పూజించిన కొత్తకుండకు కట్టి ఆకుండలో ఈ పచ్చడిని ఉగాది నాడు తయారు చేయడం అనవాయితీగా వస్తోంది. వేప పువ్వు, బెల్లం, చింతపండు, మామిడి పిందెలు, మిరియాలు, ఉప్పు కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది నాడు ఈ ప్రసాదం తప్పకుండా ఆరగించాలని శాస్త్రం చెబుతుంది.
ఆరోగ్యానికి దివ్య ఔషధం
ఉగాది పచ్చడి ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పని చేస్తుంది. ప్రకృతి ద్రవ్యాల ఈ ప్రసాదం ఆరగిస్తే ఏడాది పాటు ఆరోగ్యంగా ఉంటారని అందరి నమ్మకం. అందుకే ఈ పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని ఆరగిస్తారు. ఆరు రుచులు కలిగిన ఈ ఉగాది పచ్చడిలోని పదార్థాలు ఆరోగ్యానికి చేసే మేలు ఈ విధంగా ఉంటాయి.
వేప పువ్వు : చేదుగా ఉండే వేపపువ్వు వాతాన్ని హరిస్తుంది. జ్వరం, దగ్గు, వంటి వ్యాధులను పోగొడుతుంది. మధుమేహన్ని కూడా అదుపులో ఉంచుతుంది. కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.
బెల్లం : తియ్యగా ఉండే బెల్లంలో మధుర రసం పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్కు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. ఒంట్లో రక్తవృద్ధిని పెంచుతుంది.
చింతపండు : చింతపండులో ఆమ్లరసం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒంట్లోని వాతాన్ని పైత్యాన్ని తగ్గిస్తుంది. నోటికి ప్రత్యేకమైన రుచిని కలిగిస్తుంది.
మామిడి : మామిడి కాయలో విటమిన్ ఏ,సీలతో పాటు మరెన్నో పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పిచు
పదార్థాలు ప్రేగులో కాన్సర్ వ్యాధి రాకుండా నివారిస్తుంది.
మిరియాలు : మిరియాలులో ఉండే ఘూటు రసం వాతాన్ని పొగోడుతుంది. అదే విధంగా శ్లేష్మ రోగాలను ఆరికడుతుంది.
లవణం(ఉప్పు) : శరీరానికి తగిన మోతదులో ఉప్పు ఎంతో అవసరం. సూక్ష్మ పోషక పదార్థాలు ఈ ఉప్పుతోనే భర్తీ అవుతాయి.
ఇతర రాష్ర్టాలలో ఉగాది….
ఈ ఉగాది మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర రాష్ర్టాలలో ఘనంగా జరుపుకుంటారు. ప్రకృతి ప్రసాదించే వస్తువులు మాత్రమే ఉపయోగించి జరుపుకునే పండుగ ఇది. ఇటు ఆరోగ్యానికి అటు జీవన పరమార్థానికి మార్గాన్ని మంచి చెడులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ జాగ్రత్త పరిచే పండుగ కాబట్టి మనమందరం నూతన సంవత్సరంగా ఈ ఉగాదిని ఆహ్వానించి పచ్చడితో రోజును ప్రారంభిస్తాం.