జైపూర్, మార్చి 21 : రంజాన్ పండుగ సందర్భంగా స్నేహితుడిని కలిసేందుకు వస్తూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్లలో శనివారం జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఊరు రామగుండంకు చెందిన పోరడ్ల సాయికుమార్ (23) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో రిప్రజెంటేటీవ్గా పని చేస్తున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకొని జైపూర్ మండలం కుందారంలో ఉంటున్న తన స్నేహితుడి వద్దకు బైక్పై బయలుదేరాడు.
టేకుమట్ల బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా వచ్చి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టేకుమట్ల మూలమలువు వద్ద రోడ్డు పనులకు మట్టి తరలిస్తున్న మెగా కంపెనీకి చెందిన టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, పదేళ్ల క్రితం సాయికుమార్ తండ్రి మల్లేశ్ కూడా లారీ ఢీకొని మృతి చెందాడు. కాగా, మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రమాదస్థలంలో ధర్నా నిర్వహిస్తున్నారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుక్కూర్చున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.