పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో సర్కారు దవాఖానలను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా అవసరమైన వసతులు కల్పిస్తూ, అన్ని విభాగాలకు వైద్య సిబ్బందిని నియమిస్తున్నది. అన్ని జిల్లాల్లో పీహెచ్సీ నుంచి మొదలుకొని ప్రధాన దవాఖానల వరకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నది. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 93 మంది సీనియర్ రెసిడెంట్లను నియమించింది. గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే తమ ప్రథమ కర్తవ్యమని ఇటీవల విధుల్లో చేరిన యువ వైద్యులు ‘నమస్తే’తో తమ మనోగతాన్ని వెల్లడించారు.
ఎదులాపురం/నిర్మల్ చైన్గేట్/మంచిర్యాల ఏసీసీ, నవంబర్ 18 : స్వరాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి అధునాతున సౌకర్యాలతో దవాఖానలే కాకుండా కొత్తగా వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతున్నది. పల్లె, బస్తీ దవాఖానలనే తేడా లేకుండా అన్ని చోట్ల అవసరమైన సిబ్బందిని నియమిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇటీవల 93 మంది సీనియర్ రెసిడెంట్లను నియమించింది. ఇందులో మంచిర్యాలకు 41, నిర్మల్కు 24, ఆదిలాబాద్కు 21, ఆసిఫాబాద్కు ఏడుగురిని నియమించింది. గతంలో రోగమొస్తే ఈ ప్రాంతం వారు నిజామాబాద్, హైదరాబాద్కు వెళ్లేవారు. దీంతో వ్యయప్రయాసాలు తప్పేవి కావు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు బలోపేతమయ్యాయి. మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికే వచ్చి సేవలు పొందుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఇక్కడే సేవలందుతున్నాయి. నిర్మల్లో అన్ని విభాగాలకు సీనియర్ రెసిడెంట్లను ప్రభుత్వం నియమించింది. వీరంతా యువ వైద్యులే. ఇందులో జనరల్ సర్జన్ 4, గైనకాలజీ 4, మైక్రోబయాలజీ 1, పాథాలజీ 2, ఈఎన్టీ 1, పిడియాట్రిక్ 3, జనరల్ మెడిసిన్ 4, సైక్రియాట్రిస్ట్1, అనస్థీషియా 2, ఆర్థోపెడిక్ 2, డాక్టర్లను నియమించింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ అన్ని విభాగాలకు యువ వైద్యులు అందుబాటులోకి వచ్చారు. వారు అందిస్తున్న సేవలు, పలు అంశాలపై వారి మనోగతం..
సేవలే ముఖ్యం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరు మాది. ప్రస్తుతం నిర్మల్లోని దవాఖానలో కంటి డాక్టర్గా పనిచేస్తున్నా. పేద రోగులకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వృత్తిని ఎంచుకున్నాను. కంటి ఇన్ఫెక్షన్, శుక్లం దెబ్బతిన్న వారు వస్తుంటారు. వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైతే కళ్లజోళ్లు అందిస్తున్నాం. జిల్లా దవాఖానలో అందించే వైద్య సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పేదల వైద్యానికి పూర్తి భరోసా కల్పించేలా సేవలందిస్తున్నాం. ప్రజల్లో గుర్తింపు రావాలంటే ఈ సేవలే ముఖ్యం.
– డా. వనజ, నేత్ర వైద్య నిపుణురాలు
పరిశోధనలు చేస్తున్న..
సామాజిక వైద్య సేవలు ఎంతో తృప్తినిస్తాయి. మాది మంచిర్యాలనే. నేను చల్మడ ఆనందరావు కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో పీజి పూర్తి చేసి సామాజిక వైద్య సేవలపై పరిశోధనలు చేస్తున్నా. ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్ మంచిర్యాల మెడికల్ కళాశాల విద్యార్థులకు బోధననందిస్తున్నా. కరోనా విపత్కర సమయంలో మెడికల్ ఆఫీసర్గా కూడా విధులు నిర్వర్తించా. పరిశోధనల విభాగంపై ఆసక్తి ఉంది.
– డాక్టర్ వల్లూరి సుచరిత, కమ్యూనిటీ మెడిసిన్, సీనియర్ రెసిడెంట్, మంచిర్యాల దవాఖాన
ల్యాబ్లో సేవలందిస్తున్నా
మాది మంచిర్యాల పట్టణం. నేను ఉస్మానియాలో ఎంబీబీఎస్ , ఎండీ పూర్తి చేశా. మంచిర్యాల మెడికల్ కళాశాలలో ల్యాబ్ విద్యార్థులకు బోధననందిస్తున్నా. ప్రభుత్వ ల్యాబ్లో వ్యాల్యువేషన్కు సంబంధించిన విధులను నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.
– డాక్టర్ గుర్రపు కరిష్మా, సీనియర్ రెసిడెంట్, మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన
డ్రగ్ సేవలను అందిస్తున్నా..
మాది నల్గొండ జిల్లా. నేను గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. ఉస్మానియా లో ఎండీ చేశా. సీనియర్ రెసిడెంట్గా మంచిర్యాల వైద్య కళాశాలకు పంపించారు. రోగికి అందించే మందులపై ఇక్కడ మెడిసిన్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాను. రోగులను బట్టి అవసరమైన మందులను అందించేలా వారికి తరగతులు నిర్వహిస్తున్నా.
– డాక్టర్ వలిశెట్టి మనోజ్ కుమార్,
ఫార్మాకాలజీ, సీనియర్ రెసిడెంట్, మంచిర్యాల
పసిపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ
మాది నిజామాబాద్ జిల్లా పోచంపల్లి. ఎండీ పూర్తి చేసి, నిలోఫర్లో పిడియాట్రిక్గా చేశా. రెండు నెలల క్రితం నిర్మల్ ప్రధాన దవాఖానలో పిల్లల డాక్టర్గా ప్రభుత్వం నియమించింది. పసి పిల్లలు జబ్బు వస్తే చెప్పుకోలేరు. వారిని పూర్తిగా పరీక్షించి, సమస్య తెలుసుకొని వైద్య సేవలందిస్తున్నాను. చిన్న పిల్లలు ఎక్కువగా జ్వరాలు, తలసేమియా, ఫిట్స్ వంటి సమస్యలతో దవాఖానకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చేవారంతా గ్రామీణ ప్రాంత పేదింటి పిల్లలు. వారికి ఉన్న అనారోగ్య సమస్యను తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పి, అవసరమైన చికిత్స అందిస్తున్నాం. అవసరమైన మేరకు మందులు ఇచ్చి పంపిస్తున్నాం.
– డా. కొండ్ర మానస, పిల్లల వైద్య నిపుణురాలు
అదృష్టంగా భావిస్తున్నా..
మాది ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఉమ్రి గ్రామం. ఆదిలాబాద్లో ఎంబీబీఎస్, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తిచేశా. ప్రస్తుతం రిమ్స్లో సీనియర్ రెసిడెంట్గా నియమించారు. సొంత జిల్లాలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వాస్తవానికి మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడానికి ఏ అధికారి అయినా వెనుకడుగు వేస్తారు. తరువాత ఇక్కడి ప్రజల అమాయకత్వం, మంచితనం చూసి వెళ్లేటపుడు బాధపడుతుంటారు. ఇక్కడ విధి నిర్వహణ నేను అదృష్టంగానే భావిస్తున్నా. సర్కారు దవాఖానల్లో సేవలందిస్తేనే మాకు నిర్మాణాత్మకంగా వైద్యంలో సాధకబాధకాలు అర్థమవుతాయి. ఈ అనుభవం ఎక్కడైనా పనికి వస్తుంది. సాధారణ రైతుకుటుంబం నుంచి వచ్చిన నేను పేద ప్రజలకు సేవలందిచాలని అనుకుంటున్నా. అందుకే సర్కారు వైద్యుడిగానే కొనసాగాలనుకుంటున్నా.
– డాక్టర్ సురుకుంటి వివేక్రెడ్డి, రిమ్స్
మెరుగైన వసతులున్నాయి
మాది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం. మహబూబ్నగర్లో ఎంఎస్ పూర్తి చేశా. నిర్మల్ దవాఖానలో మెరుగైన వసతులు ఉన్నాయి. గతంలో శస్త్ర చికిత్సలకు నిజామాబాద్, హైదరాబాద్ వంటి దవాఖానలకు వెళ్లేవారు. పేదలు అనేక ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం నిర్మల్లోనే మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. ఇక్కడి దవాఖానలోనే మోకాలి కీలుమార్పిడి. నడుం నొప్పి, ఎముకలు విరిగిన వారికి వైద్యం అందిస్తున్నాం. వచ్చిన వారిని తిరిగి పంపించకుండా 95 శాతం వైద్య సేవలందిస్తున్నాం. మోకీలు మార్పిడి వంటి ప్రధాన శస్త్ర చికిత్స ఇక్కడే చేయడంతో పేదలకు మేలు జరుగుతుంది. ప్రైవేట్ దవాఖానలో రూ. లక్షల్లో ఖర్చయ్యే శస్త్ర చికిత్సలు ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా నిర్వహిస్తున్నాం. – ఫరాజ్, ఆర్థోపెడిక్ వైద్యుడు
అన్ని రకాల సేవలందిస్తా
నిజామాబాద్ జిల్లా అర్మూర్ సమీపంలోని అంకుశాపూర్ మాది. రెండు నెలల క్రితమే ఇక్కడ డాక్టర్గా అపాయింట్మెంట్ వచ్చింది. దవాఖానకు వచ్చే అన్ని రకాల రోగులకు వైద్య సేవలందిస్తున్నా. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, బీపీ, గుండె, విషజ్వరం వంటి అత్యవసర చికిత్సలు అవసరమున్న వారికి సేవలందిస్తాను. రోగులకు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స నిర్వహిస్తాం. ఎంతటి క్రిటికల్ కేసులనైనా తీసుకుని వైద్యం చేస్తున్నాం. పేదలు ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. నిర్మల్ దవాఖానలో అనుభవమున్న సీనియర్ రెసిడెంట్ వైద్యులను నియమించడం వల్ల రోగులకు ఉచిత వైద్య సేవలు మరింత చేరువయ్యాయి.
– డా బీ నాగరాజు, జనరల్ మెడిసిన్
వైద్యురాలిగానే కొనసాగుతా
మాది హైదరాబాద్. అమ్మానాన్నలిద్దరూ టీచర్. మహబూబ్నగర్ ఎస్వీస్ కళాశాలలో 2017లో ఎంబీబీఎస్ పూర్తిచేశాను. తర్వాత మూడేళ్లు పీజీ చేశాను. 3 నెలల క్రితం ఆదిలాబాద్ రిమ్స్కు సీనియర్ రెసిడెంట్గా వచ్చా. సీజనల్, సాధారణ వ్యాధుల నివారణకు మేమంతా కృషి చేస్తున్నాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తున్నాం. నాతో పాటు ఐదుగురు జనరల్ ఫిజీషియన్లు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం దవాఖానల్లో కల్పిస్తున్న వసతులను ప్రత్యక్షంగా చూసి ఆశ్యర్యపోయాను. ఇక్కడికి వచ్చే పేద, ఆదిలాబాద్ జిల్లా వాసులు చాలా మంచివారు. నేను సర్కారు వైద్యురాలిగానే కొనసాగాలని అనుకుంటున్నా. అప్పుడే పేదలకు సేవలందించే అవకాశం దక్కుతుంది.
– స్వేచ్ఛ, జనరల్ ఫిజీషియన్ , ఆదిలాబాద్ రిమ్స్