నల్లనేల దద్దరిల్లింది.. కేంద్రంపై కన్నెర్రజేసింది. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలం కుట్రలపై కార్మికలోకం కదం తొక్కింది. మందమర్రిలో ప్రభుత్వవిప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, సీసీసీ చౌరస్తాలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రెబ్బెనలో ఎమ్మెల్యేలు సక్కు, కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో దీక్షకు దిగారు. రాష్ట్రం, సింగరేణి సంస్థపై కేంద్రం కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నినదించింది. కాగా, ఆయా చోట్ల ప్రజాప్రతినిధుల దీక్షలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సంఘీభావం తెలిపారు. సింగరేణిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తే ఊరు కోబోమని స్పష్టం చేశారు. కార్మికులకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని, సంస్థను కాపాడుకుం టామని బాల్క సుమన్ భరోసానిచ్చారు. రాష్ర్టానికి అన్యాయం చేస్తున్నా నోరుమెద
పని బీజేపీ రాష్ట్ర నాయకులతీరుపై విరుచుకుపడ్డారు.
మంచిర్యాల, ఫిబ్రవరి 9, నమస్తే తెలంగాణ : తెలంగాణ అభివృద్ధిని చూసి మోడీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదని, రాష్ట్రంపై అక్కసు వెల్లబోసుకుంటున్నదని అటవీ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల బాటలో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనే కుట్రకు మోదీ ప్రభుత్వం తెరలేపుతున్నదని, కార్మిక వర్గం కన్నెర్రజేస్తే బీజేపీ పార్టీ, ప్రభుత్వానికి పుట్టగతులుండవని మండిపడ్డారు. సింగరేణి నాలుగు బ్లాకుల వేలానికి నిర్ణ యం తీసుకున్న కేంద్రం చర్యలను, ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు బుధవారం చేపట్టిన సా మూహిక నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లో ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్ రావు, మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు. వీరితో పాటు సీసీసీలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, మందమర్రిలో మాజీ ఎమ్మెల్యే ఓదెలు, బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణతో పాటు టీఆర్ఎస్, టీబీజీకేఎస్, అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు దీక్షలో కూర్చున్నారు. వీరికి పలువురు సంఘీభావం తెలిపారు. ఆయా చోట్ల దీక్షలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు.
బొగ్గు గనులు ప్రైవేటీకరణ కాకుండా ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చి ఉదయం నుంచి దీక్ష చేపట్టిన ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గొప్పనాయకుడని, ‘రణ దీక్ష.. నిరాహార దీక్ష గొప్ప కార్యక్రమం’ అని కొనియాడారు. సింగరేణి నాలుగు బ్లాకులు వేలం వేసి, ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిని కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టులు, రైల్వేలు, ఎల్ఐసీలు, విమానాలను ధారాదత్తం చేసిందని విమర్శించారు. అవసరమైతే ఢిల్లీకి దాకా వెళ్లయినా, మన సింగరేణిని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రానికి సింగరేణి కార్మికుల నిరసన సెగ తగిలేంత వరకు ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే కారుణ్య ఉద్యోగాలు రావని, హక్కులన్నీ హరించుకుపోతాయని మంత్రి ఉద్ఘాటించారు. బొగ్గు గనుల వేలం విరమించుకునేదాకా టీఆర్ఎస్ సింగరేణి కార్మికుల పక్షాన ఉండి పోరాడుతుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కూడా రాజ్యసభ సాక్షిగా ప్రధాని విషం గక్కారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ మొండి చేయి చూపడం తెలంగాణపై ఆయనకు ఉన్న ద్వేషాన్ని బట్టబయలు చేసిందన్నారు.
సింగరేణి కోసం.. కార్మికుల కోసం మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు సామూహిక దీక్ష విజయవంతమైంది. ఈ సందర్భంగా మందమర్రిలో మార్కెట్ ప్రాంతంలో దీక్ష చేపట్టిన ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మాట్లాడారు. సింగరేణి ప్రాంత మనుగడ కోసం.. సింగరేణిని బతికించుకోవడం కోసం.. బీజేపీ విష వలయం నుంచి తప్పించడం కోసం ఒక రోజు దీ క్ష చేపట్టినట్లు చెప్పారు. సింగరేణి సంరక్షణకు ఎం తటి పోరాటానికి సిద్ధమని, తగ్గేదేలేదని ధైర్యం చెప్పారు. సింగరేణి అంటే వంద సంవత్సరాలకు పైగా వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ప్రజలతో ముడిపడ్డ భావోద్వేగ పూరితమైన అద్భుతమైన సంస్థ అని సుమన్ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ కాదని.. జీవన విధానం అని గుర్తుచేశారు. ఎంపీగా చేసిన, ఎమ్మెల్యేగా చేస్తున్న.. సింగరేణి ప్రాంతీయుల అభిరుచులు, ఆలోచనలు తనకు బాగా తెలుసన్నారు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం వేస్తే టీఆర్ఎస్కు ఏమయ్యిందని బీజేపీ సన్నాసులు, దద్దమ్మలు అంటున్నారని మండిపడ్డారు. వారికి సింగరేణి గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రాజకీయ కోణంలోనే చూస్తున్నారని, ప్రజల బాగోగుల విషయంలో ఆలోచించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దని పదేపదే సూచిస్తూ.. సింగరేణి ప్రాంతవాసులకు, కార్మికులకు హితవుపలికారు. సమస్యను మొగ్గలోనే తుంచివేయాలని సూచించారు.
తెలంగాణలో ఎవరికి కష్టం వచ్చినా పోరాటం చేయడంలో టీఆర్ఎస్ ముందుంటుందని భరోసా ఇచ్చారు. సింగరేణిని కాపాడుకునేందుకు దీక్షలు చేపట్టామని స్పష్టం చేశారు. నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి సింగరేణి ప్రాంతంలో, కార్మికుల్లో ఉంటే పెనుప్రమాదం పొంచి ఉన్నట్లేనని హెచ్చరించారు. నేడు నాలుగు బ్లాకులు, రేపు 14 బ్లాకులు వేలం వేసేందుకు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. దోస్తులకు అమ్మేందకు మోదీ సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్లో ఉత్తరం రాస్తే రాష్ట్రం వేలం మానుకున్నారని, ఇతర చోట్ల కూడా రాష్ర్టాలు లెటర్లు రాస్తే వేలం విరమించుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో సింగరేణి నాలుగు బ్లాకుల వేలం ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాలు రాసినా, ఎంపీలు, మంత్రులు, సీఎండీ విన్నవించినా పట్టించుకున్నపాపాన పోలేదన్నారు. వేలంలో పాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణలోని బీజేపీ నాయకులు గుజరాత్కు గులామ్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సింగరేణి పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. లాభాల్లో 29 శాతం వాటా ఇచ్చామని, ఇల్లు కట్టుకునేందుకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణాలు అందిచామని, మహిళలకు ప్రసూతి సెలవులు, రంజాన్, క్రిస్మస్, అంబేద్కర్ జయంతికు సెలవులు, గతంలో బంద్ చేసిన తండ్రీకొడుకుల 16 వేల ఉద్యోగాలు ఇప్పించామని గుర్తు చేశారు.
సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని బాధ వేస్తున్నదని, ఆందోళన చెందుతున్నామని.. అందుకే రోడ్లపైకి వచ్చి దీక్షలు చేపట్టామని వెల్లడించారు. సీసీసీ నస్పూర్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ వారికి ధారాదత్తం చేస్తుందన్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ సింగరేణి లాభాల్లో ఉండడం ఓర్వలేకనే, మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ కుట్రకు తెరలేపుతున్నదని విమర్శించారు. సీసీసీ నస్పూర్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, మందమర్రిలో సింగరేణి జేఏసీ మాజీ చైర్మన్ మునీర్, మాజీ విప్ నల్లాల ఓదెలు, బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్తో పాటు ప్రజాప్రతినిధులు, వర్తక వాణిజ్య, వ్యాపార సంఘాలు, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ అనుబంధ సంఘాల నాయకు లు, సభ్యులు, కార్మికులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్రెడ్డి, వీరభద్రయ్య, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.