నిర్మల్ అర్బన్, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు ఎంతగానో కృషి చేస్తోంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ దీటుగా మెరుగైన విద్య, సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. భవిష్యత్లో విద్యార్థులు అన్ని పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రభుత్వం గతేడాది నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఒకే పుస్తకంలో పాఠ్యంశాలను ముద్రించి ఇబ్బందులను తీర్చింది. ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు, నోట్బుక్లు అందించి విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను దూరం చేసింది. సర్కారు సరికొత్తగా తొలిసారిగా ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వర్క్బుక్లు అందించేందుకు చర్యలు తీసుకోగా..యూడైస్లో రూపొందించిన వివరాల ప్రకారం జిల్లాకు వర్క్బుక్లను సరఫరా అయ్యాయి. ఇటీవల నిర్మల్ జిల్లాకు వర్క్బుక్లు చేరగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలోని గోదాంలో భద్రపర్చారు. వీటిని త్వరలోనే జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా ఆయా పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు.
తొలి సారిగా 1-5వ తరగతి విద్యార్థులకు పంపిణీ
ప్రాథమిక విద్యను పటిష్టం చేసినట్లయితే విద్యార్థులు పైతరగతుల్లో సులువుగా రాణించే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ గుర్తించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు వర్క్బుక్లను సరఫరా చేస్తోంది. ప్రైవేట్ పాఠశాలల మాదిరిగా తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను వర్క్బుక్లో ప్రాక్టీస్ చేయడం వల్ల విద్యార్థులు ఆయా సబ్జెక్టులపై మరింత పట్టు సాధించే అవకాశం ఉండడమే కాకుండా పాఠాలు సులువుగా అర్థం చేసుకుంటారని ఎస్సీఈఆర్టీ నిపుణుల బృందం ప్రత్యేకంగా వర్క్బుక్లను తయారు చేసింది. ప్రతి తరగతి విద్యార్థికి మూడు వర్క్బుక్లను అందజేయనుంది. వర్క్బుక్లను ఆకర్షణీయంగా రూపొందించింది. పలు అంశాలను అంతర్బాగం చేసి మల్టీకలర్లను ఉపయోగించి ముద్రించింది.
జిల్లాలో 27355 మంది విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వం ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సరఫరా చేస్తున్న వర్క్బుక్ల్లో జిల్లాలో 27355 మందికి ప్రయోజనం చేకూరనుంది. నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో మొత్తం 545 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు, బాలికలు కలిపి మొత్తం 27355 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ప్రతి విద్యార్థికి మూడు వర్క్బుక్ల చొప్పున జిల్లా వ్యాప్తంగా మొత్తం 82,065 వర్క్బుక్లు అవసరం కానున్నాయి.
జిల్లాకు చేరిన 50,000 వర్క్బుక్లు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించనున్న వర్క్బుక్లు దశల వారీగా నిర్మల్ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో వీటిని భద్రపర్చగా…ఇప్పటి వరకు మూడు విడుతలుగా దాదాపు 50000 వర్క్బుక్లు వచ్చాయి. మిగిలిన 32000 వర్క్బుక్లు రెండు, మూడు రోజుల్లో రానున్నాయి. వీటిలో త్వరలోనే పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రైవేట్కు దీటుగా సర్కారు చదువులు
విద్యావ్యవస్థను పాఠశాల స్థాయిలోనే పటిష్టం చేసి విద్యార్థులకు ప్రైవేట్ దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక స్థాయిలో ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు వర్క్బుక్లు ఎంతో దోహదం చేయనున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వర్క్బుక్లు అందించడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి
-జుట్టు గజేందర్, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు
త్వరలోనే పంపిణీ చేస్తాం
నిర్మల్ జిల్లాలోని 545 ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది వర్క్బుక్లను ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకు సంబంధించ ప్రతి విద్యార్థికి మూడు వర్క్బుక్లు అందిస్తాం.జిల్లా వ్యాప్తంగా 27355 మంది విద్యార్థులకు మొత్తం 82,065 వర్క్బుక్లు అవసరం కానుండగా సగానికి పైగా జిల్లాకు వచ్చాయి. త్వరలోనే అన్ని ఎంఈవో కార్యాలయాలకు పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తాం.
-రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, నిర్మల్