జైపూర్, మే 4: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం మంచిర్యాలకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా సరిహద్దు ఇందారం వద్ద మహిళలు ఘన స్వాగతం పలికారు. రాత్రి 7.57 గంటలకు కేసీఆర్ బస్సు ఇందారం గోదావరి బ్రిడ్జి దాటగా 8 గంటలకు ఇందారం చేరుకున్నది. అప్పటికే అక్కడ మంగళహారతులు, పూలతో వేచి చూస్తున్న మహిళలు కేసీఆర్ బస్సు ఇందారం చేరుకోగానే బస్సుపై పూలూ కురిపిస్తూ మంగళహరతులు ఇచ్చారు.
వారికి కేసీఆర్ రెండు చేతులు జోడించి అభివాదం చేశారు. డప్పు చప్పుళ్లు, పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలకు అభివాదం చేస్తూ బస్సు ముందుకు సాగింది. ఈ స్వాగత కార్యక్రమంలో జడ్పీటీసీ మేడి సునీత సుమారు వెయ్యి మంది మహిళలతో కార్యక్రమంలో పాల్గొనగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కేసీఆర్కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
సీసీసీ నస్పూర్, మే 4: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వయ్ రాత్రి 8.18 గంటలకు సీసీసీ కార్నర్ వద్దకు చేరుకున్నది. అప్పటికే కేసీఆర్ను చూసేందుకు అభిమానులు, మహిళలు , చిన్నారులు, కార్యకర్తలు ఇక్కడికి తరలివచ్చారు.
ఈ క్రమంలో నస్పూర్ సీతారాంపల్లి రోడ్కు చెందిన కేసీఆర్ వీరాభిమాని, తెలంగాణ ఉద్యమకారుడు మామిడాల శ్రీనివాస్ కాన్వయ్కు అడ్డువచ్చాడు. దీంతో కాన్వయ్ ఆపడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కేసీఆర్ అభివాదం చేశారు. చిన్నారులను తమ తండ్రులు భుజాలపై ఎత్తుకుని కేసీఆర్ను చూపించడానికి ఉత్సాహం చూపారు. పలువురు తన సెల్ఫోన్లలో కేసీఆర్ను ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు.