ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్యాస్ ధర పెంపుపై నిరసనల హోరు
కేటీఆర్ పిలుపుతో ఆందోళనలు
రాస్తారోకోలు, ధర్నాలతో దద్దరిల్లిన చౌరస్తాలు
ప్ల కార్డులు, సిలిండర్లతో ప్రదర్శనలు
కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల నినాదాలు
పలుచోట్ల పాల్గొన్న విప్ సుమన్, ఎమ్మెల్యేలు
అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్ అంటూ మండిపాటు
వంటగ్యాస్ ధర పెంచడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు ప్రధాన చౌరస్తాల్లో రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించి ఖాళీ సిలిండర్లు ప్రదర్శించారు. ప్ల కార్డులతో ర్యాలీలు తీస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల విప్ సుమన్తో పాటు ఎమ్మెల్యేలు దివాకర్రావు, రేఖానాయక్, గడ్డిగారి విఠల్రెడ్డి పాల్గొన్నారు. అచ్చే దిన్ అంటూనే నిత్యావసరాలతో పాటు గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర సర్కారు మునిగిపోక తప్పదని హెచ్చరించారు.
మంచిర్యాలటౌన్/తాండూర్/మందమర్రి/బెల్లంపల్లిరూరల్/ జూలై 7 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు గురువారం ఆందోళనలు చేపట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నల్ల జెండాలు చేతబూని, ప్లకార్డులు, గ్యాస్సిలిండర్లను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కార్యకర్తలు, నాయకులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. టీఆర్ఎస్ యూత్ నాయకుడు నడిపెల్లి విజిత్రావు ఆధ్వర్యంలో రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి వంట చేశారు. కేంద్రప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ రూ. 450 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ. 1150 అయ్యిందని, గ్యాస్తో పాటు పెట్రోలు, డీజిల్, వంటనూనెలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మం డిపడ్డారు. పేద, మధ్యతరగతి వారిపై మోయలేని భా రాన్ని మోపుతున్న కేంద్ర ప్రభుత్వం మునగక తప్పదని హెచ్చరించారు. తాండూర్ మండలం కిష్టంపేట, మందమర్రి టీఆర్ఎస్ బీ1 కార్యాలయం వద్ద ఖాళీ సిలిండర్తో నాయకులు నిరసన తెలిపారు.
బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తాలో రోడ్డుపై కూర్చు ని నిరసన తెలిపారు. ఆదిలాబాద్లో టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. మహిళలు ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ శ్రేణులతో కలిసి ఖాళీ సిలిండర్తో నిరసన తెలిపారు. భీంపూర్ మండలం పిప్పల్కోటి, కరంజి(టీ), అంతర్గాం, అర్లి(టీ) గ్రామాల్లో గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో నాయకులు, మహిళలు ధర్నా చేపట్టారు. దస్తురాబాద్ మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించారు. భైంసా పట్టణంలోని గడ్డెన్న కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి రోడ్డుపై ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ఇచ్చోడ మండలం సిరిచెల్మలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆదేశాల మేరకు రాస్తారోకో చేశారు.
బతుకుడెట్లా..
ఉట్నూర్, జూలై 7 : నేను మక్క కంకుల వ్యాపారం చేస్తే.. రోజుకు అన్ని ఖర్చులు పోనూ రూ.200 నుంచి రూ.300 లాభం వస్తుంది. ఈ డబ్బులతో మా కుటుంబం గడవడం కష్టంగా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడంతో రవాణా చార్జీలు పెరిగాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల నంటాయి. ఇలా మంచినూనె, కూరగాయల ధరలు పెరగడం వల్ల బతుకుడెట్లా. ఇప్పుడేమో మోదీ సర్కారు సిలిండర్ ధరను అదనంగా రూ.50 పెంచింది. కేంద్రం ధరలు తగ్గించాలి. లేదంటే కుటుంబాలు రోడ్డున పడతాయ్.
– గోల్కొండ చంద్రకళ, మక్క కంకుల వ్యాపారి, ఉట్నూర్
సిలిండర్ కొనాలంటే ఏడుపొస్తుంది
వంటచేసుకునే సిలిండర్కు ఇంత ధర ఎక్కడైనా ఉందా. రూ.1105 పెట్టి సిలిండర్ కొనాలంటే ఏడుపొస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు నెలలకోసారి సిలిండర్ ధరలను పెంచుకుంటూ పోతే పేదల బతుకులు ఏం కావాలి. ఇప్పటికే పెరిగిన ధరలతో పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. ధరలు పెంచేముందు ఒకసారి ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యహరిస్తుండడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది.
– బొడగ మమత, ఆదిలాబాద్
దారుణం
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ధరలను విపరీతంగా పెంచడం దారుణం. రూ. 450 ఉన్న గ్యాస్ ధర ప్రస్తుతం రూ. 1150 కావడమంటే మామూలు విషయం కాదు. సామాన్యులపై పెనుభారం పడుతుంది. గ్యాస్తో పాటు నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరలు తరచూ పెంచుతున్నారు. వారినికి, పది రోజులకోసారి ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాగైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అన్ని రకాల వస్తువులకు ధరలు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం ధరలను వెంటనే తగ్గించాలి.
– చింతం జ్యోత్స్న, గృహిణి, మంచిర్యాల
కట్టెల పొయ్యే దిక్కు
కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపారులకు పెద్దపీట వేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించడం లేదు. ప్రధాని మోడీ మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారు. పేద ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వస్తువుల ధరలను బాగా పెంచుతున్నారు. ప్రతి నెలా రూ. 1105 సిలిండర్కు చెల్లించాలంటే ఇబ్బంది పడాల్సి వస్తున్నది. తిరిగి కట్టెల పొయ్యే దిక్కు అయ్యేలా ఉంది. – చందన, ఆదిలాబాద్
అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అచ్చే దిన్ వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ తీరుతో సచ్చే దిన్లు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటగా.. నిత్యావసర వస్తువుల రేట్లు సామాన్యులతోపాటు ఉన్నతవర్గాలనూ బెంబేలెత్తిస్తున్నాయి. దీనికితోడు గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.50 పెరగడంతో వంటింట్లోకి వెళ్లడానికి మహిళలు జంకుతున్నారు. పాత రోజుల లెక్క కట్టెల పొయ్యి మీదే వంట చేసుకునే దుస్థితి దాపురించింది. మా అసొంటి పేదోళ్లు రూ.1,105 పెట్టి కొనే పరిస్థితి ఉన్నదా? ఒక్కసారి ఆలోచించి పెంచిన ధరలు తగ్గించాలి. లేకపోతే
ఆందోళనలు కొనసాగిస్తాం.
– తంగణి రాణి, మంచిర్యాల