నిర్మల్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారం, ఎమ్మెల్యే విఠల్రెడ్డి నిరంతర శ్రమతో ముథోల్ నియోజకవర్గం అభివృద్ధి గమ్యాన్ని సాధించింది. ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తవడంతో ఇక్కడి ప్రజానీకమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో తామంతా బీఆర్ఎస్ సర్కారుకే అండగా ఉంటామని, ఎమ్మెల్యే విఠల్రెడ్డిని మరోసారి గెలిపించుకొని తమ బాధ్యతను నెరవేర్చుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డి గతంలో పరిష్కారం కానీ సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరించారు. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు వారధిగా నిలిచే పంచగుడి వంతెన నిర్మాణం ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నది. ముథోల్ నియోజకవర్గానికి నిజామాబాద్ జిల్లాను అనుసంధానం చేసే ఈ వంతెనపై నాటి పాలకులు హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు.
ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఈ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. సీఎం కేసీఆర్కు సమస్య తీవ్రతను వివరించారు. దీంతో ముఖ్యమంత్రి గోదావరిపై పంచగుడి వద్ద వంతెన నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. నిధులు మంజూరు కాగానే పనులు చకచకా పూర్తయి వంతెన నిర్మాణం జరిగింది. దీంతో ముథోల్ నియోజకవర్గానికి నిజామాబాద్ జిల్లా అనుసంధానమైంది. ప్రతి రోజూ వందలాది మంది ఇరువైపులా రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే అర్లి చెక్క నుంచి లోకేశ్వరం మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డులో అర్లి వద్ద సుద్దవాగుపై ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన వంతెన శిథిలావస్థకు చేరుకున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంతెన దెబ్బతినడంతో రాకపోకలు నిలిపి వేశారు. దీంతో ఇక్కడ నూతన వంతెన కోసం ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం స్పందించి వంతెన నిర్మాణానికి అవసరమైన రూ.46 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు ప్రధాన వంతెనల నిర్మాణంలో ముథోల్ నియోజకవర్గంలోని కుంటాల, భైంసా, లోకేశ్వరం మండలాల ప్రజలకు అనువుగా మారింది.
గతంలో ఆయా మండలాల ప్రజలు సరిహద్దులోనే ఉన్న నిజామాబాద్ జిల్లాకు వెళ్లాలంటే 60-80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలోని లోకేశ్వరం మండలంలో పిప్రి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రూ.62 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో.. గడ్డెన్నవాగు ప్రాజెక్టు కాలువలు, చెరువుల మరమ్మతు పనులు పూర్తయ్యాయి.
ప్రస్తుతం పిప్రి ఎత్తిపోతల పథకం పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలో అదనంగా మరో ఐదు వేల ఎకరాలకు సాగునీరందనున్నది. దీంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఇక్కడి గిరిజన పల్లెలకు రోడ్డు రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడ్డారు. గిరిజన తండాలు, గూడేల ప్రజలు భైంసా పట్టణానికి, నియోజకవర్గ కేంద్రమైన ముథోల్కు రావాలంటే నానా తంటాలు పడేవారు. అలాంటిది గత పదేండ్ల్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతి గిరిజన పల్లెకు రోడ్డు సౌకర్యం ఏర్పడిన కారణంగా వారంతా సునాయసంగా రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు రవాణా సౌకర్యం మెరుగవడంతో పల్లెల రూపురేఖలే మారిపోయాయి.
చదువుల తల్లి సరస్వతీ అమ్మవారి క్షేత్రమైన బాసర ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రూ.20 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా.. ఈ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. భక్తుల వసతి కోసం అతిథి గృహాలను నిర్మించడంతోపాటు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నీడపట్టున సేదదీరేందుకు ప్రత్యేకంగా భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రాచీన ఆలయాలను గుర్తుకు తెచ్చేలా ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తి చేశారు. త్వరలోనే గర్భాలయ పనులు ప్రారంభం కానున్నాయి.