ఎదులాపురం, మార్చి 23: బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిలాబాద్ అర్బన్, మావల మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడంపై మండిపడ్డారు. ఆయా పార్టీలు ప్రసుత్తం అధికారంలోఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వచ్చే నెలలో గృహలక్ష్మి పథకం ద్వారా నియోజకవర్గంలో 1500 మందిని ఎంపిక చేస్తామని, ఒక్కో లబ్ధిదారుడికి రూ.3లక్షల చొప్పున ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని వివరించారు. మూడోసారి కూడా రాష్ట్రంలో అధికారంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న రూ.400 వంట గ్యాస్ రూ.1200, రూ.72 ఉన్న పెట్రోల్ ధర రూ.110కి పెంచినట్లు తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలతో పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, ఆర్ఐ శశికళ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు బండారి సతీశ్, భరత్, అర్చన, సుజాత , షానాజ్, కోవ రవి, కోఆప్షన్ సభ్యుడు ఏజాజ్ఖాన్, మహిళ విభాగం పట్టణ అధ్యక్షురాలు స్వరూపారాణి, పట్టణ ప్రధాన కార్యదర్శి మమత పాల్గొన్నారు.
రూ.50 లక్షలతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
పట్టణంలోని 23వ వార్డులో రూ.50 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యేకు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 200 మందికి ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 23వార్డుల్లో రూ.3.20కోట్లతో వివిధ పనులు చేపట్టామని, మరో రూ.1.20కోట్లు అభివృద్ధికి కేటాయించామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ పందిరి భూమన్న, అశోక్ స్వామి, సంద నర్సింగ్, బండారి సతీశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కో ఆప్షన్ సభ్యుడు ఏజాజ్, నాయకులు మమత, దాసరి రమేశ్, కొండ గణేశ్, గోలి శంకర్, చిన్నసాయి ఉన్నారు.
రీడింగ్ కార్నర్ ప్రారంభం
ఆదిలాబాద్ టౌన్, మార్చి 23 : ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి పాఠశాలలో ఏర్పాటు చేసిన రీడింగ్ కార్నర్ను ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా ఎంపీపీఎస్ అంకోలి పాఠశాలలో దాదాపు రూ.18 లక్షలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మండలాధ్యక్షుడు గండ్రత్ రమేశ్, అంకోలి సర్పంచ్ భూమన్న, డీఈవో ప్రణీత, సెక్టోరియల్ అధికారి నర్సయ్య, ఎంఈవో జయశీల, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రహ్లాద్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్పీ రాజేశ్వర్ పాల్గొన్నారు.