ఆదిలాబాద్ రూరల్ : ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడతామని ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్టీయూభవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాలల్లో విద్యావలంటీర్లు , స్కావెంజర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్,విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, ఎండీఎం కార్మికుల బ్యాంకుల మార్పు గురించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.4వేల కోట్లను కేటాయించనుందని తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయన్నారు. ఈ ఏడాది 2.75లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ఉపాధ్యాయుల కృషేనన్నారు. ఈసందర్భంగా ఎస్టీయూరాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు తీర్చాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర రివైజ్డ్ పే స్కేల్ 2020 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకులు సుధాకర్, పర్వతిరెడ్డి, భుజంగర్రావ్ , సాతూరి ముకుంద్రావ్, జిల్లా అధ్యక్షకార్యదర్శులు అశోక్, మూగ శ్రీనివాస్,వివిధ జిల్లాల అధ్యక్షకార్యదర్శులు పాల్గొన్నారు.