నిర్మల్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మాస్టర్ ప్లాన్ అంశాన్ని తెరమీదకు తీసుకవచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. సోమవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు. 1990లో నిర్మల్ పట్టణ జనాభా 52 వేలు ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ను రూపొందించారని, ఇప్పుడు పట్టణ జనాభా లక్షా 60వేలు దాటిందన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ మేరకే నిర్మల్ను మరింత అభివృద్ధి చేసుకునేందుకు నూతన డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్ను ప్రజల ముందుంచామన్నారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ప్రజాభిప్రాయ సేకరణలో 591 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు.
బీజేపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి ఈ ప్రాంత రైతులను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆయనకు రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. పట్టణాభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్లో లోపాలుంటే తెలియజేయాలి కాని, దానిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేయడం శోచనీయమన్నారు. ఇది ముమ్మాటికీ అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు. ఇప్పటికైనా ఆమరణ నిరాహార దీక్ష పేరుతో డ్రామాలు ఆపాలని ఆయన మహేశ్వర్ రెడ్డిని కోరారు. నిర్మల్ శివారులోని మంజులాపూర్, తల్వెద గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతుల నిర్ణయం మేరకు అక్కడ ఇండస్ట్రీయల్ జోన్ను ఏర్పాటు చేయబోమన్నారు. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందని తెలిపారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపి అందరికీ అనువుగా ఉండేలా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, నేరేళ్ల వేణు, ఎడ్పెల్లి నరేందర్, ఎస్పీ రాజు, గండ్రత్ రమణ, నవీన్, లక్కాకుల నరహరి, మతిన్, జహీర్, పీ శ్రీకాంత్, నామెడ రమ్య, ఫరహత్ ప్రహీం, నర్సవ్వ, సలీం, కో-ఆప్షన్ సభ్యుడు చిలుక గోవర్ధన్, నాయకులు కోటగిరి అశోక్, కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.