‘మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. ఒక్కో జీపీకి రూ.10 లక్షల చొప్పున రూ.31.10 కోట్లు ఇస్తాం. ఏడు మున్సిపాలిటీలు ఉండగా.. ఒక్కో మున్సిపాలిటీకి రూ.25 కోట్ల చొప్పున రూ.175 కోట్లు మంజూరు చేస్తాం.’ అని జూన్ 30వ తేదీన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం రెండు నెలల్లోనే రూ.206.10 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిధుల విడుదలకు ఆదేశాలు ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– మంచిర్యాల, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిలబెట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా ప్రత్యేక అభివృద్ధికి రూ.206.10 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. దీంతో మంచిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున రూ.175 కోట్లు, 310 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున రూ.31.10 కోట్ల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్యల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ప్రతి ఊరుకు రూ.10 లక్షలు, మున్సిపాలిటీకి రూ.25 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల్లోనే నిధులు విడుదలకు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం ఆయా మున్సిపాలిటీలు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు నిధుల విడుదలకు ఆదేశాలు ఇవ్వడంపై మంచిర్యాల జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– మంచిర్యాల, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
చెన్నూర్, ఆగస్టు 30 : మంచిర్యాల జిల్లా పర్యటనలో రాష్ట్రవ్యాప్తంగా కులవృత్తులకు రూ.లక్ష సాయం చెక్కులు, దివ్యాంగులకు పింఛన్ పెంపు, రెండో విడుత గొర్రెల పంపిణీని ప్రారంభించారు. అనంతరం జరిగిన ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో మున్సిపాలిటీలు, పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులు చేపడుతాం. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్
ప్రత్యేక నిధుల్లో మంచిర్యాల నియోజకవర్గానికే సింహభాగం కేటాయించారు. మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు రూ.75 కోట్లు రానున్నాయి. ఈ నిధులతో మున్సిపాలిటీల్లో మరిన్ని పనులు చేస్తాం. ప్రతి ఒక్క రూపాయిని ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తాం. గతంలో ఏ సీఎం ఇవ్వని విధంగా కేసీఆర్ నిధులు ఇస్తున్నారు. ఇప్పటికే లెక్కకు మించిన అభివృద్ధి పనులతో మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో టాప్ గేర్లో దూసుకుపోతున్నది. అడిగిన వెంటనే నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– నడిపెల్లి దివాకర్రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం. ఒక్కసారి మాట ఇస్తే తప్పరని సీఎం కేసీఆర్ మరోసారి రుజువు చేసి చూపించారు. అడిగిన వెంటనే నిధుల మంజూరుకు హామీ ఇచ్చి నెరవేర్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు ప్రత్యేక అభివృద్ధికి ఇవ్వడం గొప్ప విషయం. గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం సీఎం కేసీఆర్కే సాధ్యం. బెల్లంపల్లి మున్సిపాలిటీకి ఇచ్చిన రూ.25 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతాం. మా నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే, బెల్లంపల్లి
మంచిర్యాలటౌన్, ఆగస్టు 30 : ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టణాలు, పల్లెల అభివృద్ధికి రూ. 206 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలంతా రుణపడి ఉంటారు. మంచిర్యాల పట్టణానికి మంజూరైన రూ. 25 కోట్లతో కొత్తగా ఏర్పడిన కాలనీలను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే కౌన్సిల్లో ఈ విషయంపై చర్చ జరిగింది. కౌన్సిలర్లంతా ముక్తకంఠంతో శివారుకాలనీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు అన్ని వార్డుల్లో చేపడుతాం. ఇప్పటికే జనరల్ఫండ్, పట్టణ ప్రగతి నిధులతో పనులు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి స్వరాష్ట్రంలో జరుగుతుంది. ఇదివరకున్న ముఖ్యమంత్రులు హామీ ఇస్తే అది నెరవేరుతుందన్న నమ్మకం ఉండేది కాదు. కానీ మన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడి నిధులు మంజూరు చేస్తున్నారు.
– పెంట రాజయ్య, మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల