ఎదులాపురం, మార్చి 4 : ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించిన సందర్భంగా నాయకులను అరెస్టు చేసి గొంతునొక్కే ప్రయత్నం చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సీపీఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పూసం సచిన్లతోపాటు సీసీఐ సాధన కమిటీ కో-కన్వీనర్ అరవింద్ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే సీపీఐ ఆదిలాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సాధన కమిటీ చైర్మన్ సిర్ర దేవేందర్ను కూడా మావల పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుం దెబ్బ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుర్స పోచయ్య, రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షుడు గొడం గణేశ్, వివిధ పార్టీల నాయకులను సోమవారం ఉదయం 3 గంటలకు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు రాజ్యాం గం కల్పించిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మోదీ పర్యటన సందర్భంగా అరెస్టుల పర్వానికి తెరలేపడం సరికాదన్నారు.
ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటు వంటి తుడుందెబ్బ సంఘం నాయకులను అరెస్టు చేయడం సిగ్గు చేటని ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుర్స పోచయ్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిలు తుడుం దెబ్బ సంఘం నాయకులను అరెస్టు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. అనంతరం అరెస్టు చేసిన నాయకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. మావల పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివాసీ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు.