సోన్, జూలై 29 : వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ధ్వజమెత్తారు. సోన్ మండలం జాఫ్రాపూర్, మాదాపూర్ గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. వరదల కారణంగా కొట్టుకుపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసి నష్ట నివారణ చర్యలను గణనీయంగా తగ్గించుకోగలిగామని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో రికార్డుస్థాయిలో 64 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని మంత్రి గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు వరద పోయిన తర్వాత గ్రామాల్లోకి వచ్చి రైతులపై మొసలికన్నీరు కారుస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కడెం ప్రాజెక్టు ప్రమాదపుటంచుల వరకు చేరుకున్న దాన్ని ధైర్యంగా గేట్లను తెరిపించడం వల్ల పెద్ద ముప్పు తప్పిందన్నారు.
జిల్లాలో భారీ వర్షాల వల్ల సుమారు 50వేల ఎకరాల వరకు పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈనెల 31న రాష్ట్ర క్యాబినెట్లో వరద నష్టంపై చర్చించి బాధితులకు అండగా ఉండేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జాఫ్రాపూర్, మాదాపూర్ శివారులో పంటలకు నష్టం, రోడ్లు కొట్టుకపోవడం జరుగుతున్నదని, దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో కలెక్టర్, అధికారులు అప్రమత్తంగా ఉండి పంట, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారని, అలాంటి అధికారులపై కొన్ని రాజకీయపార్టీల నాయకులు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్రెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ హిమబిందు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ అశోక్, పంచాయతీరాజ్ డీఈ తుకారాం, జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, సర్పంచ్ సునీత-ప్రకాశ్రెడ్డి, బీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, మండల వ్యవసాయశాఖ అధికారి వినోద్, ఏఈవో రజిని, అశోక్, ఎంపీడీవో మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని వంజర్, మలక్చించోలి, కంకెట గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. శాశ్వత మరమ్మతుల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టంపై అంచనా వేసి సర్వే రిపోర్టు తయారు చేయాలన్నారు. అనంతరం దోనిగాం ప్రాజెక్టును సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ వరుణ్రెడ్డి, ఈఈ రామారావు, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, మార్కెట్ చైర్మన్ అశ్రుతరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, సర్పంచ్లు భోజారెడ్డి, లస్మయ్య, ఎంపీటీసీ భోజారెడ్డి, నాయకులు రాజ్మహ్మద్, శ్రీనివాస్రెడ్డి, భూమేశ్, మల్లయ్య, దేవిశంకర్, రాజేశ్వర్రావు, నాగుల రాంరెడ్డి, రాజేశ్వర్రెడ్డి, లింగారెడ్డి, కండెల భోజన్న, శేఖర్ పాల్గొన్నారు.
వరద నష్టం నివేదిక తయారు చేయాలి
నిర్మల్ జిల్లాలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం వివరాలను పక్కగా నివేదించాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సమీకృత కలెక్టరేట్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి వరదలతో జరిగిన నష్టాన్ని రైతులు, అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో మరింత నష్టం జరగకుండా అధికారులు కష్టపడి పని చేశారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 30 చెరువులు తెగిపోయాయని, 1200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, 230 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. వీటిని మూడు రోజుల్లో పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిరాల ప్రాజెక్టు తెగిపోవడంతో 1800 ఎకరాల్లో నష్టం జరిగిందని, గ్రామస్తులను సహాయ చర్యలు చేపట్టి కాపాడగాలిగామన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని సుమారు రూ.50 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందేలా చూడాలని భగీరథ అధికారులకు ఆదేశించారు. ఇళ్లు కూలిపోయిన వారికి ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. జిల్లాలో వరదలతో పంటలు దెబ్బతిన్నాయని, వ్యవసాయశాఖ అధికారులు సర్వే చేసి నివేదిక అందించాలని కోరారు. గిరిజన సంక్షేమశాఖ, విద్యాశాఖ, రెవెన్యూ, మున్సిపల్, తదితర శాఖల నష్టాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అర్లి వాగుపై రూ.100 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన పంపామని, వర్షాలు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. వ్యవసాయశాఖ అధికారులు పంటల యాక్షన్ప్లాన్ రూపొందించుకోవాలని ఆదేశించారు. భైంసా, నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో పునరుద్ధరణ చర్యలు వేగంగా చేపట్టినట్లు తెలిపారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ.. ముథోల్ నియోజకవర్గంలో వరదలతో ఎక్కువగా నష్టం జరిగిందని, ప్రాధాన్యత కింద తమ నియోజకవర్గంలో పనులను వేగంగా చేపట్టాలన్నారు.
భూ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి
నిర్మల్జిల్లాలో ఎస్సారెస్పీలో ముంపునకు గురైన కుటుంబాలకు డీ1 కింద ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసినప్పటికీ కొన్ని గ్రామాల్లో అలాంటి భూములు అసైన్డ్ కింద ధరణిలో చూపెడుతున్నందున దీనికి శాశ్వత పరిష్కారాన్ని ఆరు నెలల్లో చూపెడుతామని మంత్రి హామీనిచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలోని బొప్పారం, కంజర్, పొట్టపెల్లి, బన్సపల్లి, న్యూవెల్మల్ తదితర గ్రామాల్లో ఎస్సారెస్పీలో ముంపునకు గురైనప్పుడు ప్రభుత్వం పునరావాసం కింద డీ1 పట్టాలిచ్చినప్పటికీ ఇప్పుడు ఆ భూమిని అమ్ముకునేందుకు వీలులేకుండా పోతుందని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మూడు రోజుల్లో సర్వే నిర్వహించి సీసీఎల్ ద్వారా భూసమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రై తులకు ఏమాత్రం నష్టం జరగకుండా చూ స్తామన్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రావు, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, జిల్లా అధికారులు విజయలక్ష్మి, కిషన్, అంబాజీనాయక్, సందీప్, రామారావు, రాజేశ్వర్గౌడ్, శ్యాంరావు, దేవేందర్, ప్రసాద్, శంకరయ్య, అంజిప్రసాద్, జైవంత్రావుచౌహాన్, జడ్పీటీసీ జీవన్రెడ్డి తదితరులున్నారు.
అధైర్య పడొద్దు …అండగా ఉంటాం
బైంసా, జూలై 29 : ప్రజలు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని విశ్రాంతి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరిందన్నారు. భైంసాలోని పంట పొలాలతో పాటు లోతట్టు ప్రాంతాలైన ఆటోనగర్, భట్టిగల్లీ, రాహుల్నగర్ తదితర ప్రాంతాలు నీటమునిగాయన్నారు. గుండేగాం గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం వైపరీత్యాలు జరిగినా సాయం చేయడం లేదన్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పాకాల రాంచందర్, సీనియర్ నాయకులు బామ్ని రాజన్న, ఆసిఫ్, పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, తోట రాము, బీఆర్ఎస్ నాయకులు, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
సిరాలను రీ డిజైన్తో నిర్మిస్తాం..
భైంసాటౌన్, జూలై 29 : కొట్టుకుపోయిన సిరాల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి నిర్మిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి సిరాల ప్రాజెక్టును సందర్శించారు. గ్రామస్తులతో మా ట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నా రు. తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించారు. సిరాల గ్రామస్తులందరూ సురక్షితం గా ఉన్నందుకు సర్పంచ్ సతీశ్, అధికారులను అభినందించారు. ఉమ్మడి జిల్లాలోనే భైంసా మండలంలో అధిక నష్టం జరిగిందన్నారు. సిరాల ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం రూ.10 కోట్లు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పాకాల రాంచందర్, బామ్ని రాజన్న, సదాశివ్, సీఐ నైలు, ఎంపీవో మోజమ్ హుస్సేన్ ఉన్నారు.