తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా సర్కారు వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పని చేస్తున్న 23 వేల మందిని క్రమబద్ధీకరిస్తామంటూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగా, దశాబ్దాల కల సాకారమవుతున్నది. పేస్కేల్ వర్తింపజేయడంతో పాటు వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తామని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2011 మందికి ప్రయోజనం చేకూరగా, సంబురం అంబరాన్నంటుతున్నది. ఈ మేరకు శుక్రవారం పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు.. సర్కారుకు జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, మే 19(నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ పనుల్లో వీఆర్ఏలు కీలకపాత్ర పోషిస్తారు. వివిధ సర్టిఫికెట్ల జారీ మొదలుకొని.. ఎన్నికల విధుల వరకూ వీరే కీలకంగా వ్యవహరిస్తారు. గ్రామాలకు చెందిన ప్రతి సమాచారం వీరికి తెలిసి ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వీరిదే ముఖ్యభూమిక. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని ఎన్నో ఏండ్లుగా వీఆర్ఏలు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయడంతో పాటు వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంచిర్యాల జిల్లాలో 538 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 311 మంది, నిర్మల్ జిల్లాలో 748మంది వీఆర్ఏలకు మేలు జరగనుంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 414 మంది వీఆర్ఏలు ఉండగా, వీరిలో 366 మంది వారసత్వంగా, 48 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యారు. సర్కారు నిర్ణయంపై శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్ర పటాలాకు పాలాభిషేకం చేసి.. ఆయనకు రుణపడి ఉంటామంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేను 20 ఏండ్లుగా వీఆర్ఏగా పనిచేస్తున్నా. గ్రామాల్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన పనులతో పాటు ప్రజలకు వివిధ రకాల సేవలు అందిస్తున్నా. ఇన్ని రోజులుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం సంతోషంగా ఉంది. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తల్లో చూసిన. చాలా సంతోషంగా ఉంది. మా జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడిగా భావిస్తున్నాం.
-సూరం రమేశ్, వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
హాజీపూర్, మే 19 : గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తామని ప్రకటించడం ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు. పేస్కేల్ వర్తింపజేస్తూ తదుపరి ప్రమోషన్స్ వచ్చే విధంగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినందుకు ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ చిరుద్యోగులైన వీఆర్ఏల సమస్యల ను మానవత్వంతో పరిష్కరించినందుకు రుణపడి ఉంటాం.
-దేవి దశరథం, వీఆర్ఏల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, మంచిర్యాల
హాజీపూర్, మే 19 : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారు. రాష్ట్రంలోని 23,000 మంది వీఆర్ఏల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు కేసీఆర్. క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్నం దుకు అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి త్వరలోనే జీవో అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము.
-కామెర నారాయణ, వీఆర్ఏల సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షుడు
కోటపల్లి, మే 19 : మా శ్రమను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రికి మా వీఆర్ఏలు రుణపడి ఉంటారు. మా శ్రమను కేసీఆర్ గుర్తించి మా సమస్యలను మానవత్వంతో పరిష్కరించి మాకు దేవుడిగా మారాడు. ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్ మేలు ఎప్పటికీ మరచిపోము. – సుధాకర్, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు, కోటపల్లి
నేను 13 ఏండ్లుగా వీఆర్ఏగా పనిచేస్తున్నా. రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రతి పనిలో మా అవసరం ఉంటుంది. గ్రామాల్లో ప్రజలకు వివిధ రకాల సేవలు అందించడం, ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు చేయడంలో మాదే కీలక పాత్ర. వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి సైతం సహాయ, సహకారాలు అందిస్తున్నాం. మా సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, క్రమబద్ధీకరణ చేసేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం.
-ఇందూర్ గంగన్న, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్
ఖానాపూర్ రూరల్, మే 19: నేను తొమ్మిందేండ్లుగా ఖానాపూర్ వీఆర్ఏగా పని చేస్తున్నా. 2014లో వచ్చిన వీఆర్ఏ నోటిఫికేషన్లో పరీక్ష రాసి, ఉద్యోగం సంపాదించా. ఆనాటి నుంచి చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని పోషిస్తూ విధులకు హాజరవుతున్నా. మా సమస్యలను అర్థం చేసుకొని గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చింది.ఇది మాకు తీపి కబురే. మా మండలంలో 65 మంది వీఆర్ఏలం ఉన్నం. ఇప్పుడు అన్ని కుటుంబాల్లో వెలుగులు నిండినట్లే.
-మద్దెల సంతోష్, ఖానాపూర్ వీఆర్ఏ
నేను 30 ఏండ్ల నుంచి రెవెన్యూ శాఖలో వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న. ఉద్యోగంలో చేరినప్పుడు ప్రతి నెల నాకు రూ.30 వేతనం వచ్చేది. ముప్పై ఏళ్లుగా ప్రజలకు పలు సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు జరిగేలా కృషి చేశా. మా ఉద్యోగాల పర్మినెంట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ మా కలను నెరవేర్చారు. ఇప్పటికైనా ఉద్యోగం పర్మినెంట్ కావడం సంతోషంగా ఉంది.
– సయ్యద్ మహ్మద్, వీఆర్ఏ, ఆదిలాబాద్ రూరల్ మండలం
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మా ఉద్యోగా లను పర్మినెంట్ చేయడం సంతోషంగా ఉంది. మా సేవలను గుర్తించిన ప్రభుత్వం మాకు పేస్కేల్ వర్తింపజేసేందుకు నిర్ణయించడంతో మా కుటుంబాల్లో వెలుగులు నిండాయి. సర్కారు ఇచ్చిన అవకాశంతో మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. చిరుఉద్యోగులమైన మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మా కుటుంబాలకు భరోసా ఇచ్చింది. – టీ అశోక్, వీఆర్ఏ, ఆదిలాబాద్ అర్బన్ మండలం
దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేశాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించా లని ఎన్నో సందర్భాల్లో కోరాం. గతంలో ఏ ఒక్కలూ పట్టించుకోలే. ఇప్పుడు సీఎం కేసీఆర్ మా ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయడం సంతోషంగా ఉంది. పేస్కేలు అమలు పరుస్తామని క్యాబినెట్ మీటింగ్లో ప్రకటించడం శుభపరి ణామం. గవర్నమెంటు తీసుకున్న నిర్ణయం మా కుటుంబాలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సంతోషం మాటల్లో చెప్పలేనిది. సీఎం కేసీఆర్ కు మేమంతా రుణపడి ఉంటాం.
-బిచ్చాల శేఖర్, వీఆర్ఏ, ఖానాపూర్
రాష్ట్రంలో ఏ వర్గానికి ఎప్పుడు ఏంకావాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి మన సీఎం కేసీఆర్ ఒక్కడే. వీఆర్ఏలుగా మేము పడే కష్టాలను పూర్తిగా తెలుసుకొని మమ్ములను రెగ్యులర్ చేస్తున్నారు. మా ఆనందాలకు అవధులు లేవు. మా సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
– కామెర ప్రకాశ్, వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు, బెజ్జూర్